మీ ‘స‌మ‌రం’ ఎవ‌రి మీద‌?.. ఉద్యోగుల‌కు ఇచ్చిప‌డేసిన రేవంత్

తెలంగాణ ప్ర‌భుత్వ ఉద్యోగులు త‌మ డిమాండ్ల సాధ‌న కోసం చేయ‌ త‌లపెట్టిన ‘ప్ర‌భుత్వంపై స‌మ‌రం’పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పు లు చెరిగారు. “మీ స‌మ‌రం ఎవ‌రి మీద‌?.” అని నిల‌దీశారు. ఉద్యోగులు చేసే స‌మ‌రం ఏదైనా.. ప్ర‌భుత్వంపై కాద‌ని.. ప్ర‌జ‌ల‌పైనేనని తేల్చి చెప్పారు. ఉద్యోగుల క‌ష్టాలు, న‌ష్టాలు తెలుసుకునే తాము అన్ని విధాలా వారికి స‌హ‌క‌రిస్తున్న‌ట్టు చెప్పారు. జీతాలు గ‌తంలో ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌ని ప‌రిస్థితి నుంచి ఇప్పుడు ఠంచ‌నుగా ఇచ్చే ప‌రిస్థితికి తీసుకువ‌చ్చామ‌న్నారు. అదేవిధంగా వారి ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌సును 61 ఏళ్ల‌కు పెంచామ‌ని చెప్పారు.

ఇంత చేస్తున్నా.. ఉద్యోగుల‌పై ఎలాంటి వ‌త్తిడీ లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. “ఈ సమరాలు ప్రజల మీదే అవుతాయి. ప్రభుత్వ ఉద్యోగులు మూడున్నర లక్షల మంది ఉన్నారు. కానీ.. ప్ర‌జ‌లు 97 శాతం మంది ఉన్నారు. ఇప్పుడు వారు చేసే స‌మ‌రం ప్ర‌జ‌ల మీదే అవుతుంది త‌ప్ప‌. ప్ర‌భుత్వంపై కాదు” అని రేవంత్ తేల్చి చెప్పారు. గ‌త ప్ర‌భుత్వం ప‌దేళ్ల‌పాటు ప‌నిచేసి ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన వాటిని పెండింగులో పెట్టింద‌ని.. ఇది 9 వేల కోట్ల‌కు చేరింద‌ని.. దీనిని ఇవ్వాల‌ని త‌మ‌పై ఒత్తిడి తెస్తున్నార‌ని వ్యాఖ్యానించారు. గ‌త ప్ర‌భుత్వాన్నే ఎందుకు అడ‌గ‌లేద‌ని ప్ర‌శ్నించారు.

ఉద్యోగుల విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం సానుకూల దృక్ఫ‌థంతో ఉంద‌న్న రేవంత్ రెడ్డి .. వారితో ఏ విష‌యంపైనైనా చ‌ర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామ‌ని తెలిపారు. వ్య‌క్తిగ‌తంగా తాను కూడా పొదుపు మంత్రం ప‌ఠిస్తున్న‌ట్టు సీఎం చెప్పారు. ఇక నుంచి విమానాలు, హెలికాప్ట‌ర్ల‌ను సాధ్య‌మైనంత త‌క్కువ‌గా వినియోగించుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు. “ప్రభుత్వ ఖర్చులను నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఎంత వ‌ర‌కు సాధ్య‌మైతే.. అంత వ‌ర‌కు త‌గ్గిస్తాం.” అని చెప్పారు. అలాగ‌ని ప్ర‌జ‌ల‌కు ఇచ్చే సంక్షేమ ప‌థ‌కాల‌ను ఆప‌బోమ‌ని వెల్ల‌డించారు. ఏదో ప‌థ‌కం ఆపి త‌మ‌కు మేలు చేయాల‌ని ఉద్యోగులు కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నార‌ని.. ఏ ప‌థ‌కం ఆపేది లేద‌ని చెప్పుకొచ్చారు.