జగన్ మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే!

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు శుక్రవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు. అంగరంగ వైభవంగా, ఓ వేడుకలా, ఓ పండుగలా జరుగుతున్న ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్న జగన్ ఓ మంచి అవకాశాన్ని తన చేజేతులారా మిస్ చేసుకున్నారనే చెప్పాలి. అమరావతిలో కన్నులపండువగా జరుగుతున్న ఈ వేడుకకు హాజరు కావాలంటూ కూటమి సర్కారు స్వయంగా ఆహ్వానించినా జగన్ ఆ ఆహ్వానాన్ని మన్నించలేదు. శుక్రవారం జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానం బుధవారం సాయంత్రమే జగన్ కు అందింది. అయితే తన మునుపటి వైఖరి మాదిరే మొండిగా సాగిన జగన్… గురువారం రాత్రే తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లిపోయారు. వెరసి అమరావతి పునర్నిర్మాణానికి తాను హాజరు కావట్లేదని ఆయన తేల్చి చెప్పేశారు.

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని కూడా లేకుండా ప్రస్థానం మొదలుపెట్టిన ఏపీకి నూతన రాజధానిగా అమరావతిని నాటి, నేటి సీఎం నారా చంద్రబాబునాయుడు ఎంపిక చేశారు. బాబు ఎంపికను స్వాగతించిన జగన్… అమరావతికి తాను వ్యతిరేకం కాదని ప్రకటించారు. అంతేకాకుండా తాను రాజధాని నిర్మాణానికి ముందే తన ఇంటిని రాజధానిలోనే కట్టుకుంటానని ప్రకటించి… తాడేపల్లిలో పాలెస్ లాంటి భవంతిని కట్టుకున్నారు. జగన్ నిజంగానే అమరావతికి అనుకూలంగా ఉన్నారేమోనన్న భావనతో 2019 ఎన్నికల్లో జనం వైసీపీకి ఓటేశారు. ఎప్పుడైతే సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారో.. జగన్ తనలోని అమరావతి వ్యతిరేకతను వ్యక్తం చేయడం ప్రారంభించారు. అమరావతి నిర్మాణాన్ని అటకెక్కించారు. కొత్తగా విశాఖలో పాలనా రాజధాని కడతానంటూ విచిత్ర ప్రకటనలూ చేశారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ ఘోర పరాజయానికి గురి కాక తప్పలేదు.

ఇదంతా గతమైతే.. అమరావతిని ఈ ఐదేళ్లలో ఎలాగైనా పూర్తి చేసి తీరాల్సిందేనని చంద్రబాబు ఓ గట్టి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి రెండో సారి సీఎం అయిన వెంటనే అమరావతి పునర్నిర్మాణంపై దృష్టి సారించారు. తొలుత నిధులను సాధించిన చంద్రబాబు… పనులను పున:ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న చంద్రబాబు.. అమరావతిని ప్రారంభించిన మోదీ చేతుల మీదుగానే పునర్నిర్మాణాన్ని కూడా చేపట్టాలని భావించారు. అందుకు మోదీ కూడా సరేనన్నారు. వెరసి కార్యక్రమానికి సమయం ఆసన్నమవుతున్న వేళ.. చంద్రబాబు రాజకీయాలను పక్కనపెట్టేశారు. విపక్ష నేతగా, మాజీ సీఎంగా జగన్ ను కూడా ఈ వేడుకకు ఆహ్వానించాలని భావించారు. నిబంధనల మేరకు ప్రొటోకాల్ సిబ్బంది పంపి మరీ జగన్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయితే జగన్ బాబు ఆహ్వానాన్ని తిరస్కరించి ఎంచక్కా బెంగళూరు చెక్కేశారు.

వాస్తవానికి అమరావతి పునర్నిర్మాణానికి హాజరై ఉంటే… ప్రజల్లో తన పట్ల ఉన్న వ్యతిరేకతను కొంతైనా తగ్గించుకునే అవకాశం జగన్ కు ఉండేది. గతంలో జరిగిన పరిణామాలను మనసులో పెట్టుకోకుండా… తన ఓటమిని కూడా సానుకూలంగానే తీసుకున్న జగన్ అమరావతి పునర్నిర్మాణానికి వచ్చారని జనం భావించేవారు. ఇకపై అమరావతిని జగన్ వ్యతిరేకించరులే అన్న భావనను ఆయన జనంలో కలిగించి ఉండేవారు. అంతేనా… ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలు ముగిసిన తర్వాత రాజకీయాలు మాట్లాడను అన్న తన మాటను కూడా ఆయన నిజం చేసి ఉండేవారు. ఇదే భావనను మోదీలోనూ కలిగించి తన పట్ల ఒకింత సానుకూలత వ్యక్తమయ్యేలా చేసుకునేవారు. అయితే తనదైన శైలి మొండి వైఖరితోనే సాగిన జగన్.. అమరావతి పునర్నిర్మాణాన్ని దాదాపుగా బాయ్ కాట్ చేసినంత పని చేశారు. మొత్తంగా అందివచ్చిన ఓ మంచి అవకాశాన్ని జగన్ చేజేతులారా నాశనం చేసుకున్నారన్న విశ్లేషణలు సాగుతున్నాయి.