వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో దాదాపు 3500 కోట్ల రూపాయల మేరకు మేసేశారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. విచారణ చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజ్ కసిరెడ్డిని పోలీసులు అరెస్టు చేయడం.. విచారణ సాగిస్తుండడం తెలిసిందే. ఇక, తాజాగా.. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం జగన్ సెక్రటరీ కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పీఏ బాలాజీ గోవిందప్పలు.. ఉలిక్కి పడ్డారు.
వారిని కూడా ఏ క్షణంలో అయినా అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. దీంతో వారు హుటాహుటి న హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిని విచారించిన హైకోర్టు.. ముందస్తు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేసింది. కాగా.. వీరు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లకు సంబంధించి ప్రభుత్వ వాదనను హైకోర్టు కోరింది. దీనిపై ప్రాసిక్యూషన్.. తమకు కొంత సమయం కావాలని కోరింది. దీనికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.
ఈ క్రమంలో అప్పటి వరకు తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని.. పిటిషనర్లు.. కె.ధనంజయ రెడ్డి, పీఏ పి.కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు హైకోర్టును కోరారు. కానీ.. ప్రాసిక్యూషన్ సమయం కోరినంత మాత్రాన అప్పటి వరకు పిటిషనర్లకు బెయిల్ ఇవ్వలేమని కోర్టు తెలిపింది. అసలు ప్రభుత్వ వాదన వినకుండా నిర్ణయాలు తీసుకోలేమని కూడా వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది.
అయితే.. వారి పేర్లు కేసులో ఉన్నా.. విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం వీరిని ఇంకా విచారణకు పిలవలేదు. అయినప్పటికీ.. అరెస్టు భయం వెంటాడుతుండడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. కానీ.. వారికి బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates