నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో ఇప్పుడు ఎక్కడ చూసినా నిర్మాణ రంగ పనులతో కోలాహలంగా కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రానికి చెందిన ఈ రాజధాని నిర్మాణ పనుల్లో తెలుగు కార్మికులే కాకుండా దేశం నలుమూలల నుంచి వచ్చిన కార్మికులు… అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. అమరావతిలో తమ జీవనోపాధిని చూసుకుంటున్నారు. తమ కడుపునూ నింపుకుంటున్నారు. మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా అమరావతి పరిధిలో ఏ కార్మికుడిని కదిలించినా.. అమరావతి లాంటి నగరాల నిర్మాణాలు తమకు జీవనోపాధిని కల్పించేవేనని చెబుతున్న వైనం నిజంగానే ఆసక్తి రేకెత్తిస్తోంది. ఏదో చిన్న చిన్న నిర్మాణాలు కాకుండా… అమరావతి లాంటి ప్రపంచ స్థాయి రాజధాని నగరం నిర్మాణం అంటే సుదీర్ఘంగా సాగే క్రతువు. దీనిద్వారా లక్షలాది మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తుంది.
గతంలో టీడీపీ ప్రభుత్వ పాలనలో అమరావతి నిర్మాణ పనులు జెట్ స్పీడుతో సాగాయి. ఈ క్రమంలో ఆయా పనులు చేపట్టేందుకు ఎక్కడెక్కడి నుంచో కార్మికులు వేలాదిగా అమరావతికి తరలివచ్చారు. అమరావతి నిర్మాణ పనుల్లో ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. అమరావతి నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోగా… పొట్ట చేతబట్టుకుని అమరావతి వచ్చిన కార్మికులంతా… దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడికెళ్లాలో కూడా తెలియక ఇంటి బాట పట్టారు. అమరావతి నిర్మాణంలో ఏళ్ల తరబడి తమకు ఇక్కడే పని లభిస్తుందన్న కార్మికుల సంతోషాన్ని వైసీపీ సర్కారు చిదిమేసింది. అయితే టీడీపీ నేతృత్వంలోని కూటమి మరోమారు అధికారంలోకి రావడంతో అమరావతిలో మరోమారు కార్మికులకు చేతి నిండా పని లభించింది.
ఇప్పుడు అమరావతిలో ఎక్కడ చూసినా కార్మికుల కోలాహలమే కనిపిస్తోంది. నిర్మాణ రంగంలో వివిధ పనులు చేపట్టేందుకు ఆయా పనుల్లో నైపుణ్యం సంపాదించుకున్న కార్మికులంతా ఉత్సాహంగా పనుల్లో నిమగ్నం అయ్యారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులను కదిలించగా… అమరావతి లాంటి మహా నగరాల నిర్మాణం ఏ మేర లాభసాటి అన్న విషయాలు వెలుగు చూశాయి.
అమరావతి లాంటి ప్రపంచ స్థాయి నగరాల నిర్మాణం జరిగితేనే కదా… తమ లాంటి కార్మికులకు పని దొరికేది అంటూ ఓ కార్మికుడు చెబితే… ఈ తరహా భారీ నిర్మాణ పనులు కార్మిక లోకానికి సుదీర్ఘ కాలం పాటు జీవనోపాధిని చూపించినట్టేనని మరో కార్మికుడు అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా అమరావతిలో ఎంతకాలం పని ఉంటే… అంత కాలం ఇక్కడే ఉంటామని కూడా మరో కార్మికుడు సంతోషంగా చెప్పుకొచ్చాడు.
కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు కార్మిక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్మిక లోకానికి అండగా నిలిచేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని చంద్రబాబు చెప్పారు. ఇందులో భాగంగా అందివచ్చిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకుని కార్మిక లోకం ముందుకు సాగాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు.
కార్మిక లోకానికి మంచి చేయడమే లక్ష్య ంగానే తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని కూడా ఆయన పేర్కొన్నారు. శ్రామికులే అభివృద్ధిలో అసలైన భాగస్వాములు అని లోకేశ్ తన మేడే సందేశంలో పేర్కొన్నారు. కూటమి పాలనలో కార్మికులతో పాటు కర్షకుల అభ్యున్నతికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates