హోం మంత్రి అనితను మెచ్చుకున్న పవన్

సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవం సందర్భంగా గోడ కూలి ఏడుగురు భక్తులు చనిపోయిన ఘటన ఏపీలో పెను కలకలం రేపింది. మంగళవారం అర్థరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ ప్రమాదంలో మరికొందరు గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే…రాష్ట్ర హోం, విపత్తులశాఖ మంత్రి వంగలపూడి అనిత వేగంగా స్పందించారు. బుధవారం తెల్లవారుజామున 3 గంటలకే ఆమె ఘటనా స్థలికి వెళ్లారు. అక్కడ పరిస్థితులను సమీక్షించి.. బాధితులకు భరోసాగా నిలిచారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించడం, మృతుల కుటుంబాలను ఓదారుస్తూ ఆమె క్షణం తీరిక లేకుండా సాగారు. మీడియా అడిగిన రకరకాల ప్రశ్నలకు విసుగు లేకుండా సమాధానం చెప్పారు.

రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న అనిత.. పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ అధికారులను అలెర్ట్ చేసి… ఉదయం నిద్ర లేచాక తాను ఎప్పుడో 10గంటలకు వెళ్లినా అడిగే వారే లేరు కదా. అయితే ప్రమాదం జరిగిందన్న విషయం తెలియంగానే అనిత క్షణకాలం కూడా ఆలస్యం చేయకుండా ఘటనా స్థలానికి బయలుదేరారు. అనిత శ్రమ ఊరికే పోలేదు. సాయంత్రానికంతా జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అనిత గొప్పతనాన్ని కీర్తిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. అంతేకాకుండా అనిత పనితీరు తమ కూటమి ప్రభుత్వ భరోసాకు నిదర్శనంగా నిలిచిందని కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విపత్కర పరిస్థితుల్లో అనిత బాద్యతల నిర్వహణ అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

విపత్కర పరిస్థితుల సమయంలో అనిత చూపుతున్న చొరవ, బాధితులకు ఆమె బాసటగా నిలుస్తున్న తీరు కూడా అభినందనీయమని కూడా పవన్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రజా జీవితంలో ఉన్న వారు ఏ సమయంలో అయినా స్పందించడమే కాకుండా శోకంలో ఉన్న వారికి సాంత్వన కూడా చేకూర్చాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అనిత ఆ దిశగానే సాగుతున్నారని ఆయన కొనియాడారు. సింహాచలం ప్రమాదం గురించి తెలియగానే… తెల్లవారుజామున 3 గంటలకు ఆమె ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారని ఆయన గుర్తు చేశారు. పహల్ గాం ఘటనలో చంద్రమౌళి కుటుంబానికీ అనిత అండగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. తమ కూటమి ప్రభుత్వం బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి అనిత బాధ్యతల నిర్వహణ ఒక తార్కాణం అని పవన్ ఆమెను ఆకాశానికెత్తేశారు.

ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అనిత.. తన ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేశారు. టీడీపీలో చేరి అంచెలంచెలుగా ఎదిగారు. చంద్రబాబు చుట్టూ ఉండే అతి కొద్దిమంది నేతల్లో అనిత కూడా ఒకరిగా మారిపోయారు. చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ తోనూ సన్నిహితంగా సాగే అనిత… ప్రస్తుతం టీడీపీ మహిళా విభాగం తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. పార్టీ విపక్షంలో ఉండగా.. పార్టీ అధిష్ఠానంపై ఈగ వాలకుండా రక్షణ గోడగా నిలిచిన వారిలో అనిత ముందు వరుసలో ఉంటారని చెప్పాలి. ఈ కారణంగానే టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రాగానే.. పార్టీకి ఆమె చేసిన సేవలను గుర్తించిన చంద్రబాబు… అనితకు ఏకంగా హోం మినిస్టర్ గా అవకాశం కల్పించారు. పనితీరులో నిబద్ధత కలిగిన నేతగా అనిత పేరు తెచ్చుకున్నారు.