ఏపీలో తాజాగాఖాళీ అయిన.. రాజ్యసభ(పెద్దల సభ) సీటును బీజేపీ ఎట్టకేలకు ఖరారు చేసింది. నామినేషన్ దాఖలుకు కేవలం 18 గంటల ముందు(మంగళవారం మధ్యాహ్నం 3 గంటలతో దాఖలుకు సమయం ముగుస్తుంది) అభ్యర్థిని ఖరారు చేయడం విశేషం. కాగా.. ఈ దఫా బీజేపీ.. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన పాకా సత్యనారాయణకు పెద్ద పీట వేసింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పాకా.. ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తగా తన ప్రస్తానాన్ని ప్రారంభించారు. గత ఎన్నికల్లో రాజమండ్రి సీటును ఆశించారు. కానీ.. ఆయనకు దక్కలేదు.
ఇక, ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. పాకా పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే.. కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు.. ఢిల్లీ వర్గాలతో చేసిన లాబీయింగ్ ఫలించి.. ఆ సీటు ఆయనకు దక్కింది. దీంతో పాకా అప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో తాజా బీజేపీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ.. రాజ్యసభ స్థానానికి పాకా సత్యనారాయణ పేరును ఖరారు చేసింది. శెట్టి బలిజ సామాజిక వర్గానికి చెందిన వారిని తొలిసారి బీజేపీ పెద్దల సభకు పంపుతుండడం గమనార్హం. అయితే.. పాకా కూడా.. తొలిసారి ప్రజాప్రతినిధిగా రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.
ఇదిలావుంటే.. వైసీపీ మాజీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీని… కూటమి పార్టీల్లో టీడీపీ లేదా జనసేన తీసుకోవాలని భావించాయి. అయితే.. ఏపీ నుంచి రాజ్యసభలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకపోవడం.. తమకు పెద్దల సభలో అవసరం ఉన్న నేపథ్యంలో బీజేపీ నాయకులుఈ సీటును కోరి మరీ తీసుకున్నారు. దీంతో చంద్రబాబు కూడా.. ప్రధాని మోడీకి గిఫ్ట్గా ఈ సీటును ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
కాగా.. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లకు అవకాశం ఉన్న దరిమిలా.. ఇతర సభ్యులు, పార్టీలు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోతే.. పాకా ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే.. ఎమ్మెల్యేలకు ఎన్నిక నిర్వ హించి.. ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం.. పాకా తప్ప ఎవరూ నామినేషన్ వే సే అవకాశం లేదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలే ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ కూడా పోరాడే పరిస్థితి లేదని అంటున్నారు.