ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత రక్షణ వ్యూహానికి మరో భారీ బలం జతకానుంది. భారత్ సముద్ర పరిరక్షణ సామర్థ్యాన్ని పెంచే దిశగా ఫ్రాన్స్తో కీలక ఒప్పందం కుదిరింది. రఫేల్ మెరైన్ (Rafale Marine) యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి సుమారు రూ.63,000 కోట్ల విలువైన ఈ డీల్పై సోమవారం అధికారికంగా సంతకాలు జరిగాయి.
ఈ ఒప్పందం ప్రకారం, భారత నౌకాదళానికి 22 సింగిల్ సీట్ రఫేల్-ఎం యుద్ధ విమానాలు, 4 ట్విన్ సీట్ శిక్షణ విమానాలు లభించనున్నాయి. ఈ విమానాలు ప్రత్యేకంగా స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఐఎన్ఎస్ విక్రాంత్ వంటి విమాన వాహక నౌకల నుంచి కార్యకలాపాలు నిర్వహించబోతున్నాయి. 2031 నాటికి అన్ని విమానాల డెలివరీ పూర్తవుతుందని అధికారులు వెల్లడించారు. ప్రధాన మంత్రి మోదీ నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCS) ఈ ఒప్పందానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
రఫేల్-ఎం జెట్స్ అమాంతం భారత్కు ఆధునిక సముద్ర రక్షణ సామర్థ్యాన్ని తీసుకురాబోతున్నాయి. ఈ 4.5వ తరం యుద్ధ విమానాలు ఎక్సోసెట్ ఏఎం39 యాంటీ-షిప్ మిస్సైళ్లు, స్కాల్ప్ గగనతలం నుంచి భూమి క్షిపణులు, మెటియోర్ ఎయిర్-టు-ఎయిర్ మిస్సైళ్లు వంటి అత్యాధునిక ఆయుధాలను కలిగి ఉంటాయి. ఇవి భారత నౌకాదళానికి శత్రు దేశాలపై సుదూర దాడులు నిర్వహించేందుకు, సముద్రంలో వాయు ఆధిపత్యాన్ని చాటేందుకు మునుపెన్నడూ లేని శక్తిని ఇవ్వబోతున్నాయి.
ఇప్పటికే భారత్ వాయుసేనలో రఫేల్ యుద్ధ విమానాల సేవలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. దీంతో లాజిస్టిక్స్, విడిభాగాల నిర్వహణ వంటి అంశాల్లో సౌలభ్యం కలిగించడానికి ఇది కీలక ముందడుగు కావడం విశేషం. పైగా, నౌకాదళానికి ప్రస్తుతం ఉన్న మిగ్-29కె ఫ్లీట్ తరచూ సేవల లోపాలతో ఇబ్బంది పడుతుండటంతో, ఈ కొత్త రఫేల్-ఎం జెట్స్ అత్యవసరంగా అవసరమయ్యాయి.
ప్రస్తుత యుద్ధ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ ఒప్పందం ద్వారా భారత్ మరోసారి తన సైనిక శక్తిని గ్లోబల్ లెవల్లో హైలైట్ చేసుకునే అవకాశాన్ని పొందింది. సముద్ర ప్రాంతాల్లో భారత్ ప్రతాపం మరింత పెరగనుంది. దీని వల్ల పాకిస్థాన్ సహా ప్రత్యర్థి దేశాలకు ఇది బలమైన మానసిక దెబ్బగా పనిచేసే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో భారత్ తన రక్షణ వ్యూహాన్ని మరింత పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు ఈ రఫేల్ మెరైన్ యుద్ధ విమానాల డీల్ కీలకంగా నిలవనుంది.