ఏపీ రాజధాని అమరావతి పరుగులు పెడుతోంది. ఈ నెల 13 నుంచి పనులు శర వేగంగా పూర్తవుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి 8 వేల కోట్ల రూపాయలు సుమారుగా ప్రభుత్వానికి చేరాయి. దీనికి తోడు.. రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తం కేటాయించింది. ఫలితంగా ప్రస్తుతం 15 వేల కోట్ల రూపాయలతో ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనికి కాంట్రాక్టర్లు కూడా తోడయ్యారు. దీంతో సుమారు 65 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతున్నాయి.
ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని మంత్రి నారా లోకేష్ తాజాగా అమరావతి నిర్మాణాలకు సంబంధించి వీడియోను రాష్ట్ర ప్రజలతో పంచుకున్నారు. మొత్తం నవనగరాలు, నివాసాలు, హైకోర్టు, సచివాలయం.. సహా ఏయే భవనాలు వస్తున్నాయో.. ఈ వీడియోలో వివరించారు. అదేవిధంగా కృష్ణానదిపై నిర్మించనున్న అమరావతి-హైదరాబాద్ రహదారి అనుసంధానం ప్రాజెక్టును కూడా పేర్కొన్నారు. అలానే.. ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణాన్ని కూడా.. వీడియోలో సమగ్రంగా చూపించారు.
రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమై.. వడివడిగా సాగుతున్న నేపథ్యంలో ప్రతిపక్షం వైసీపీ చేస్తున్న ప్రచారానికి చెక్ పెట్టేలా నారా లోకేష్ ఈ వీడియోను పంచుకోవడం గమనార్హం. అంతేకాదు.. ఏయే ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడుతున్నదీ ఈ వీడియోలో వివరించారు. మొత్తంగా రాజధాని సమగ్ర రూపాన్ని స్వల్ప వ్యవధిలోనే రూపించడం గమనార్హం. కాగా.. రాజధాని పనులను సోమవారం సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అదేవిధంగా వచ్చే నెల 2న ప్రధాని మోడీ అమరావతికి రానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లను కూడా.. సీఎం పర్యవేక్షించనున్నారు.