ఏపీ సీఎం చంద్రబాబు.. ప్రస్తుతం ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలువురు మంత్రులను కలుసుకుని సాగునీటి ప్రాజెక్టులు, రైలు ప్రాజెక్టులు.. ఇతర కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తదితర అంశాలపై చర్చిస్తున్నారు. ఈ క్రమంలోనే అనూహ్యంగా ఆయనకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం నుంచిఫోన్ వచ్చింది. వాస్తవానికి షెడ్యూల్లో ఈ కార్యక్రమం లేదు.
అయినప్పటికీ..చంద్రబాబుకు స్వయంగా షా కార్యాలయం నుంచి ఫోన్ రావడంతో ఆయన హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సాదరంగా ఆహ్వానించిన అమిత్ షా.. ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అడగ మన్నారంటూ… ఓ కీలక విషయాన్ని చంద్రబాబు చెవిలో వేశారు. ప్రస్తుతం ఖాళీ అయిన.. త్వరలోనే జరగనున్న రాజ్యసభ సీటును తమకు కేటాయించాలని చంద్రబాబును మోడీ కోరినట్టు షా వెల్లడించారు.
అంతే! ఇంకేముంది.. అసలే ప్రధాని మోడీ అంటే.. ప్రాణం పెట్టేస్తున్న చంద్రబాబు ఏమాత్రం సంకోచిం చకుండానే.. ఓకే చెప్పారు. ప్రస్తుతం ఏపీలో ఒక రాజ్యసభ సీటు ఖాళీ అయింది. ఇది వైసీపీ మాజీ నాయకుడు వి. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటు. అయితే… దీనిని ముందుగానే బీజేపీకి కేటాయిస్తున్నట్టు అనుకున్నా.. కమల నాథుల నుంచి చడీచప్పుడు లేదు.
ఈ నేపథ్యంలో టీడీపీ కి చెందిన సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు లేదా.. యనమల రామకృష్ణు డులను పంపించాలని భావించారు. ఇంతలోనే నేరుగా ప్రధానే అడిగినట్టు చంద్రబాబుకు సమాచారం రావడం.. ఈ సమయంలో అమిత్షానే ఆయన చెవిలో వేయడంతో ప్రధాని మోడీకి గిఫ్ట్గా ఇస్తున్నానంటూ … చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కేంద్ర మంత్రి, తెలంగాణకు చెందిన బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అక్కడే ఉన్నారు.
కాగా.. ఈ సీటును తమిళనాడు బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఐపీఎస్ అధికారి అన్నామలై కోసం మోడీ అడిగినట్టు తెలిసింది. ఆయనను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని.. తద్వారా వచ్చే తమిళనాడు ఎన్నికల్లో పక్కా వ్యూహం ప్రకారం ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.