ఏపీలో రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణంలో సోమవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అన్నీ తానై వ్యవహరించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ మాజీ సలహాదారు కసిరెడ్డి రాజశేఖరరెడ్డి అలియాస్ రాజ్ కసిరెడ్డి సోమవారం పోలీసులకు పట్టుబడిపోయారు. సోమవారం మధ్యాహ్నం తర్వాత గోవా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వచ్చిన కసిరెడ్డిని…విమానాశ్రయం బయటే సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తాను మంగళవారం విచారణకు హాజరు అవుతున్నానని, ఇప్పుడెందుకు అదుపులోకి తీసుకుంటారని కసిరెడ్డి పోలీసులను ప్రశ్నించారట. అయితే మీరు విచారణకు వస్తారో, రారో మాకు తెలియదని, ఇప్పుడే తమ వెంట రావాల్సిందేనని పోలీసులు ఆయనను వ్యాన్ ఎక్కించేశారట.
మద్యం కుంభకోణంలో విచారణకు హాజరు కావాలంటూ కసిరెడ్డికి ఏపీ సిట్ పోలీసులు నాలుగు నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులకు తనదైన శైలి ప్రశ్నలు సంధిస్తూ వచ్చిన కసిరెడ్డి… కోర్టు ద్వారా అరెస్టు నుంచి రక్షణ పొందేదాకా విచారణను వాయిదా వేసుకునే దిశగా కదిలినట్లు సమాచారం. అయితే ముందస్తు బెయిల్ కు ఏపీ హైకోర్టు నిరాకరించింది. తాజాగా ఆయన సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించినట్లుగా ఆయనే చెప్పుకున్నారు. అక్కడేమైందో తెలియదు గానీ.. మంగళవారం తాను సిట్ విచారణకు హాజరు అవుతున్నానని సోమవారం మధ్యాహ్నమే ఓ ఆడియోను విడుదల చేశారు. ఈ ఆడియో విడుదలైన గంటల వ్యవధిలోనే కసిరెడ్డిని ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. వాస్తవానికి పోలీసులు తన కోసం వెతుకుతున్నారని, వారి నుంచి తప్పించుకునేందుకే కసిరెడ్డి… విచారణకు వస్తున్నట్లుగా ఆడియో విడుదల చేసినట్లుగా కూడా కథనాలు వినిపిస్తున్నాయి.
శంషాబాద్ ఎయిర్ పోర్టు బయట అదుపులోకి తీసుకున్న రాజ్ కసిరెడ్డిని సిట్ అధికారులు విజయవాడ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రాత్రికి ఆయనను విజయవాడకు చేర్చనున్నారు. రేపు రాజ్ కసిరెడ్డిని కోర్టులో హాజరు పరిచే అవకాశాలున్నట్లు సమాచారం. అంటే.,. కసిరెడ్డిని అరెస్టు చేపించి కోర్టు అనుమతితో ఆయనను తమ కస్టడీలోకి తీసుకుని సిట్ విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు రమ్మని పిలిచినప్పుడు రాజ్ కసిరెడ్డి వచ్చి ఉంటే… అరెస్టు అయ్యేవారో, లేదో తెలియదు గానీ… విచారణకు డుమ్మా కొట్టిన కారణంగా విచారణతో సంబంధం లేకుండానే రాజ్ కసిరెడ్డి అరెస్టు అయిపోయారని చెప్పాలి. అంటే… ఈ కేసులో తన ప్రమేయం ఉందో లేదో తెలియదు గానీ… విచారణకు ముందే.. ఈ కేసులో తొలుత అరెస్టు అయిన వ్యక్తి రాజ్ కసిరెడ్డేనని చెప్పాలి. విచారణకు హాజరై ఉంటే… బయటే ఉండి తన వాదనలు వినిపించుకునే అవకాశాన్ని రాజ్ కసిరెడ్డి స్వయంగా చేజార్చుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇక ఈ కేసులో ఇప్పటికే వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి రెండు పర్యాయాలు సిట్ విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం మొత్తాన్ని రాజ్ కసిరెడ్డే చక్కబెట్టారని సాయిరెడ్డి బహిరంగంగా వెల్లడించారు. మొన్నటి సిట్ విచారణలోనూ ఆయన ఇదే విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంటక మిథున్ రెడ్డి కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో మిథున్ రెడ్డి సిట్ అధికారులకు పెద్దగా సహకరించలేదన్న వాదనలు వినిపించాయి. మరి ఇప్పుడు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి సిట్ అధికారులకు ఏ మేర సహకరిస్తారు? అన్న దానిపై ఆసక్తికర చర్చకు తెర లేసింది. అయితే విచారణకు రాకుండా పోలీసులకు దొరికిపోయిన రాజ్ కసిరెడ్డి వ్యూహాలు అంతగా వర్కవుట్ కావన్న వాదనలూ వినిపిస్తున్నాయి.