చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుక‌లు: తీవ్ర విషాదం!

ఏపీ సీఎం చంద్ర‌బాబు 75వ‌ పుట్టిన రోజు వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌లు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సాహంగా ప్ర‌శాంతంగా జ‌రిగాయి. అయితే..క‌ర్నూలు జిల్లాలో మాత్రం ఈ వేడుక‌లు తీవ్ర విషాదం నింపాయి. కర్నూలులో ఆదివారం సాయంత్రం.. టీడీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ర్యాలీ నిర్వ‌హించారు. ఈ స‌మ‌యంలో పార్టీ కీల‌క జిల్లా నాయ‌కుడు, అధికార ప్ర‌తినిధి బోయ సురేంద్ర‌.. హ‌ఠాత్తుగా కుప్ప‌కూలిపోయారు.

సురేంద్ర వ‌య‌సు 35 సంవ‌త్స‌రాల‌ని పార్టీ నాయ‌కులు తెలిపారు. 19 ఏళ్ల వ‌య‌సు నుంచి కూడా పార్టీలో ఉన్నార‌ని.. కార్య‌కర్త స్థాయి నుంచి అధికార ప్ర‌తినిధి వ‌ర‌కు ఎదిగార‌ని పేర్కొన్నారు. ఆలూరులో ర్యాలీ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో సురేంద్ర కు ఒక్క‌సారిగా గుండె పోటు వ‌చ్చింది. దీంతో కుప్ప‌కూలిపోయారు. దీనిని గ‌మ‌నించిన కొంద‌రు.. ఆయ‌నను హుటాహుటిన ఆసుప‌త్రికి త‌రించారు. కానీ, అప్ప‌టికే సురేంద్ర మృతి చెందారని వైద్యులు తెలిపారు.

సురేంద్ర మృతితో ర్యాలీని అర్ధంతరంగా నిలిపివేశారు. ఈ ఘ‌ట‌న‌పై నారా లోకేష్ స్థానిక నాయ‌కుల‌కు ఫోన్ చేసి విచారం వ్య‌క్తం చేశారు. సురేంద్ర కుటుంబాన్ని ఆదుకోవాల‌ని.. తాను విదేశాల నుంచి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత‌.. సురేంద్ర కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తాన‌ని ఆయన హామీ ఇచ్చారు. పార్టీ ప‌రంగా అన్ని విధాలా సాయం చేయాల‌ని స్థానిక కేడ‌ర్‌కు సూచించారు.

ఇదిలావుంటే.. రాష్ట్ర వ్యాప్తంగా చంద్ర‌బాబు పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. చాలా జిల్లాల్లో చంద్ర‌బాబు దీర్ఘాష్షుతో సంతోషంగా ఉండాల‌ని కోరుకుంటూ.. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి.. మూడు రోజుల పాటు నిర్వ‌హించే హోమాన్ని త‌ల‌పెట్టారు. దీనిలో ఏకంగా 600 మంది పురోహితులు పాల్గొన్నారు.