జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుక్రవారం ఓ సంచలన వ్యాఖ్య చేశారు. భూ సంబంధిత సమస్యలపై తన కార్యాలయంతో పాటుగా జనసేన నిర్వహించిన జన వాణిలకు వెల్లువెత్తిన ఫిర్యాదులపై శుక్రవారం ఆయన ఆయా శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా భూకబ్జాలపై ఇకపై కఠినంగా వ్యవహరించనున్నట్లు ఆయన ప్రకటించారు. కష్టపడి సంపాదించుకున్న జాగాలు, వారసత్వంగా వస్తున్న ఆస్తులను కాపాడుకునేందుకు జనం ఎంతగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం గుర్తుకు తెచ్చుకుంటేనే చాలా బాధ కలుగుతుందని ఆయన అన్నారు.
ఈ తరహా పరిస్థితికి గత వైసీపీ సర్కారులో ఆ పార్టీ నేతలు అవలంబించిన తీరే కారణమని పవన్ ఆరోపించారు. పక్కా దస్తావేజులు ఉన్న ఆస్తులపైనా వివాదాలు సృష్టించి… ఆ వివాదాల ద్వారా ఏమాత్రం లిటిగేషన్ లేని భూములను కూడా వివాదంలోకి నెట్టేసి..వాటి ద్వారా ఆయా ఆస్తులను అన్యాక్రాంతం చేసేశారని పవన్ మండిపడ్డారు. ఈ తరహా చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున తనకు ఫిర్యాదులు వచ్చాయని, వాటన్నింటినీ పరిష్కరించే దిశగా ఇకపై చర్యలు చేపడతానని ఆయన అన్నారు. ఇందుకోసం త్వరలోనే జిల్లాల పర్యటనకు వెళతానని కూడా పవన్ చెప్పారు. జిల్లాల పర్యటనలో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ అధికారుల సమక్షంలో భూ సంబంధిత ఫిర్యాదులను తానే స్వీకరిస్తానని ఆయన పేర్కొన్నారు. ఆయా సమస్యలను పరిష్క్రరించే దిశగా చర్యలు చేపడతానని ఆయన చెప్పారు.
జిల్లాల పర్యటనల్లో బాగంగా తొలుత కాకినాడ, విశాఖల్లో పర్యటిస్తానని పవన్ కల్యాణ్ చెప్పారు. భూదందాలు చేసినా… ఆయా భూములకు నకిలీ దస్తావేజులు సృష్టించినా కూడా ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యవహారాల్లో కూటమి పార్టీలకు చెందిన నేతలున్నా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. ఈ చర్యల ద్వారా ఇకపై ఎక్కడైనా భూదందాలకు పాల్పడాలంటేనే భయపడేలా చేస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి పాలన నిష్పక్షపాతంగా, అత్యంత పారదర్శకంగా జరుగుతోందని ఆయన తెలిపారు. కూటమి పాలనలో ఆయా ఆస్తులకు భరోసా కల్పించే దిశగా సాగనున్నానని తెలిపిన పవన్,అందులో బాగంగానే భూసంబంధిత సమస్యల పరిష్కారంపై దృష్టి సారిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు.