హైదరాబాద్ నగరానికి మెట్రో రైలు ఒక ప్రధాన జీవనాడి లాంటిది. రోజూ వేలాది మంది ప్రజలు ఈ రైల్ను వినియోగించుకుంటూ, ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యల నుంచి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా వేసవి వేడి మధ్య ఎయిర్ కండిషన్డ్ సౌకర్యాలతో కూడిన మెట్రో ప్రయాణం ఒక వరంగా మారింది. అయితే, ఇదంతా తక్కువ ఖర్చుతో కుదిరిన రోజులే. ఇప్పుడు మాత్రం మెట్రో ఛార్జీలు పెరిగే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
కరోనా కాలం నుంచి హైదరాబాద్ మెట్రో తీవ్ర ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది. ఇటీవలే మెట్రో సంస్థ ఎల్ అండ్ టీ ప్రకటించిన వివరాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల మేర నష్టం కలిగింది. ఈ నష్టాలను భర్తీ చేసుకోవడానికి ఛార్జీల పెంపునే ఆలోచనగా తీసుకొచ్చింది. గతంలోనూ ఈ ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచినప్పటికీ అప్పటి పాలకులు ఆమోదించలేదు. అయితే, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో మరోసారి ఛార్జీల పెంపుపై చర్చ మళ్లీ మొదలైంది.
మెట్రో ఛార్జీలు పెంచాలన్న అంశంపై ఇప్పటికే కేంద్రం నియమించిన ప్రత్యేక కమిటీ తమ నివేదికను అందజేసినట్టు తెలుస్తోంది. ఎల్ అండ్ టీ పునఃప్రతిపాదన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నదే ఇప్పుడు కీలకం. ప్రయాణికుల నుంచి అభ్యంతరాలు రావచ్చన్న ఆందోళనలో ఉన్నా, సంస్థకు నష్టాలు తగ్గాలంటే ఛార్జీల పెంపు తప్పనిసరి అని అధికారులు భావిస్తున్నారు.
ప్రస్తుతం రూ.10 నుంచి రూ.60 వరకూ ఉన్న టికెట్ ధరలు ఎంతవరకు పెరుగుతాయన్నదానిపై స్పష్టత లేకపోయినా, బెంగళూరులో మెట్రో ఛార్జీలు 44 శాతం పెరిగిన విషయం అధికారులు గుర్తు చేస్తున్నారు. దీనిపై హైదరాబాద్ ప్రయాణికులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిటీలో మెట్రోపై ఆధారపడే మధ్య తరగతికి ఇది భారం కాకుండా చూడాలని కోరుతున్నారు. ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.