ఈ సారి అమరావతికి మోదీ ఎం తెస్తున్నారు?

నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ రాజధాని పునర్నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే ప్రధాని టూర్ షెడ్యూల్ ఖరారు కాగా.. పునర్నిర్మాణ ప్రారంభోత్సవానికి శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇదంతా బాగానే ఉన్నా… ఈ దఫా రాజధాని అమరావతికి ప్రధాని మోదీలో వస్తున్న నరేంద్ర మోదీ ఏం తీసుకురానున్నారన్న విషయంలో ఇప్పటికే ఓ ఆసక్తికర చర్చకు తెర లేసింది. కేంద్రం నుంచి అమరావతికి సంపూర్ణ మద్దతును మోదీ తీసుకువస్తున్నారన్న దిశగా ఈ చర్చ జరుగుతోంది.

వాస్తవానికి అమరావతి రాజధాని పనులను భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోదీనే 2017లో ప్రారంభించారు. రాజధాని కూడా లేని రాష్ట్రం పట్ల సానుకూలంగా మోదీ స్పందిస్తారని, అమరావతికి మోదీ నుంచి భారీ ప్యాకేజీ ప్రకటన ఉంటుందని నాడు అంతా భావించారు. అయితే పుణ్య స్థలాల నుంచి మట్టి, పవిత్ర నదుల నుంచి జలం తీసుకువచ్చిన మోదీ… వాటిని అమరావతికి నిర్మాణానికి సమర్పించారు. కేంద్రం నుంచి మద్దతు మాట అయితే ఆయన నోట నుంచే రాలేదు. నాడూ ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్నా కూడా అమరావతికి మోదీ పెద్దగా ఏమీ ఇవ్వలేదనే చెప్పాలి. అయితే ఇప్పుడు అలా మాత్రం కాదని మెజారిటీ వర్గాలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 

2014 ఎన్నికల తర్వాతి పరిస్థితికి, 2024 ఎన్నికల తర్వాతి పరిస్థితికి చాలా మార్పు ఉంది. నాడు బీజేపీ సొంతంగానే కేంద్రంలో అదికారం చేజిక్కించుకునే స్థాయి ఫలితాలు రాగా… 2024లో టీడీపీతో పాటు జేడీయూ వంటి పార్టీలు మద్దతు ఇస్తే తప్పించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఎన్డీఏ ఏర్పాటు చేయలేని పరిస్థితి. ఈ పరిస్థితులను బేరీజు వేసుకున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు టీడీపీతో పాటుగా ఏపీకి గతంలో ఎన్నడూ లేనంత ప్రాధాన్యం ఇస్తున్నారు. 2024లో ఎన్డీఏ సర్కారు హ్యాట్రిక్ సాధించినంతనే… అమరావతికి కేంద్రం నుంచి ఓ రేంజి మద్దతు లభించింది. వరల్డ్ బ్యాంకు రుణంతో పాటుగా హడ్కో రుణాలకు కేంద్రం గ్యారెంటీ ఇచ్చి మరీ అమరావతికి అండగా నిలిచింది.

ఇక చంద్రబాబు అడిగిందే తడవుగా అమరావతికి రైల్వే లైను, అవుటర్ రింగు రోడ్డు, ప్రధాన జాతీయ రహదారులను కలిపేలా కొత్త రహదారులు… అన్నింటికీ కేంద్రం అనుమతులు ఇచ్చేసింది. ఇకపైనా చంద్రబాబు అమరావతి కోసం ఏం అడిగినా కూడా మోదీ కాదనరనే భావన అయితే వచ్చేసింది. ఇలాంటి నేపథ్యంలో అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి వస్తున్న మోదీ… కార్యక్రమంలో భాగంగా అమరావతికి ఓ భారీ ప్యాకేజీ అయితే ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ప్యాకేజీ తర్వాత అమరావతికి నిధుల కొరత అన్నదే రాదని, అమరావతి రూపు రేఖలే మారిపోనున్నాయన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.