ప్రస్తుతం ఐటీ రాజధానిగా భాసిల్లుతున్న విశాఖపట్నానికి మహర్దశ పట్టనుంది. తాజాగా విశాఖపట్నానికి సంబంధించిన అనేక కీలక ప్రాజెక్టులకు చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ పచ్చజెండా ఊపింది. ప్రధానంగా విశాఖకు మణిహారంగా భావిస్తున్న టీసీఎస్ ఏర్పాటుకు ప్రాధాన్యం ఇచ్చింది. టీసీఎస్ సంస్థతో రెండు మాసాల కిందట సర్కారు ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ.. విశాఖలో ఏర్పాటుకు మొగ్గు చూపడంతో ఐటీ హిల్స్పై ఏర్పాటుకు సర్కారు అంగీకరించింది. దీనికిగాను 21.66 ఎకరాలను కేటాయించేందుకు పచ్చజెండా ఊపింది.
దీంతో విశాఖ ఐటీ సిటీకి టీసీఎస్ పెద్ద ఎస్సర్ట్ కానుంది. అదేవిదంగా విశాఖలో ఏర్పాటు చేస్తామని సిద్ధమైన ఉరుస క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్కి కూడా విశాఖ నగర సమీపంలోనే 3.5 ఎకరాల భూమిని కేటాయించింది. లీజు ప్రాతిపదికన ఈ భూములు కేటాయించడం గమనార్హం. ఈ క్లస్టర్కు కాపులుప్పాడలో 56 ఎకరాల భూమిని కేటాయిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక, మరో కీలకమైన ప్రాజెక్టు విద్యుత్ ఉత్పాదక ప్రాజెక్టు. మావోయిస్టు ప్రభావిత బలిమెల, జోలాపుట్ ప్రాంతాల్లో హైడల్ విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలన్నది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్.
గతంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం, వైసీపీ సర్కారు ఈ ప్రాజెక్టులపై ఒడిశాతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు ఒడిశాలో బీజేపీ ప్రభుత్వమే ఉండడంతో కూటమి సర్కారుకు మరింత అనుకూల పరిస్తితి ఏర్పడింది. దీంతో ఒడిశా పవర్ కన్సార్టియమ్కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం. దీని వల్ల 30 మెగావాట్ల సామర్థ్యంతో 2 హైడల్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తాయి. తద్వారా.. ఉత్తరాంధ్రలోని కీలక గిరిజన ప్రాంతాలకు విద్యుత్తును సరఫరా చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇక, విశాఖ సహా.. ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో పవన విద్యుత్, సౌర విద్యుత్ ప్లాట్ల ఏర్పాటుకు కూడా చంద్రబాబు నేతృత్వంలోని మంత్రి వర్గం పచ్చజెండా ఊపింది. తద్వారా విశాఖ స్వరూపం మారిపోతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.