మాధవ్ చిందులు ఇంతమందిని బుక్ చేశాయా?

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ మొన్న పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించడం, ఆపై తనను అరెస్టు చేసిన పోలీసులపై చిందులు తొక్కడం ఏపీలో పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాను మాజీ పోలీసు అధికారిని అని, మాజీ ఎంపీని అని పోలీసులపై ఆయన చిందులేసిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఈ తరహా మాధవ్ చిందులాట ఏకంగా 11 మంది పోలీసులపై చర్యలకు కారణంగా నిలిచింది. మాధవ్ ను అదుపులోకి తీసుకుని కూడా నిలువరించలేకపోయారంటూ గుంటూరు పరిధిలోని నగరపాలెం, పట్టాభిపురం, అరండల్ పేట పోలీస్ స్టేషన్లకు చెందిన 11 మంది పోలీసులపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు.

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై ఇటీవలే ఐటీడీపీ యాక్టివిస్టు చేబ్రోలు కిరణ్ కుమార్ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయగా… ఆయనను సస్సెండ్ చేసిన టీడీపీ.. ఆయనపై చట్టపరమైన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో కిరణ్ ను అరెస్టు చేసి మంగళగిరి నుంచి గుంటూరు తరలిస్తున్న క్రమంలో పోలీసు వాహనాన్ని అడ్డగించిన మాధవ్… కిరణ్ పై దాడికి యత్నించారు. ఈ కేసులో మాధవ్ తో పాటు ఆయన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచే సమయంలో మాధవ్ పోలీసులపై ఓ రేంజిలో చిందులు తొక్కారు. ఏం తమాషా చేస్తున్నారా? అంటూ ఫైరయ్యారు. ముఖానికి మాస్కు లేకుండానే నేరుగా కోర్టులోకి ప్రవేశించారు. 

ఈ దృశ్యాలన్నీ అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దీంతో ఎంత మాజీ ఎంపీ అయితేనేం, ఎంత మాజీ పోలీసు అదికారి అయితేనేం…మాధవ్ ఓ కేసులో నిందితుడు కదా. నిందితుడిని అదుపు చేయలేకపోతే ఇక పోలీసు వ్యవస్థ ఎందుకు? అన్న దిశగా పోలీసు బాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో వివరాలు సేకరించారు. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లుగా భావిస్తూ.. అరండల్ పేట సీఐ వీరస్వామి, పట్టాభిపురం, నగరపాలెం ఎస్సైైలు రాంబాబు, రామాజంనేయులు, ఏఎస్సైలు ఆంథోనీ, ఏడుకొండలుతో పాటుగా నగరపాలెం పీఎస్ కు చెందిన ఐదుగురు, అరండల్ పేట పీఎస్ కు చెందిన ఓ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు వేశారు.