గోరంట్ల మాధవ్ కు 14 రోజుల రిమాండ్… జైలుకు తరలింపు

వైసీపీ కీలక నేత, హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు శుక్రవారం ఊహించని షాక్ తగిలింది. పోలీసుల అదుపులోని నిందితుడిపై దాడికి యత్నించిన గోరంట్లతో పాటు ఆయన ఐదుగురు అనుచరులకు గుంటూరు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వైసీపీకి చెందిన మరో నేత జైలు బాట పట్టినట్టైంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి రెడ్డిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ కుమార్ పై పోలీసుల సమక్షంలోనే మాధవ్ దాడికి యత్నించగా.. పోలీసులు అదుపులోకి తీసుకుని కోర్టులో పరచగా… కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆయనను పోలీసులు నెల్లూరు జైలుకు తరలించనున్నారు.

వైసీపీ అధికారంలో ఉండగా… ఇష్టారాజ్యంగా వ్యవహరించారని ఆరోపణలు ఎదుర్కొన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్, రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్, ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిలు ఇప్పటిదాకా జైలు గడప తొక్కారు. వీరిలో దాదాపుగా అందరూ బయటకు రాగా… వంశీ ఒక్కరే జైలులో ఉన్నారు. తాజాగా ఈ జాబితాలోకి గోరంట్ల మాధవ్ చేరిపోయారు. గుంటూరు జిల్లా జైలులో చేబ్రోలు కిరణ్ కుమార్ ఇప్పటికే ఉన్నందున.. మాధవ్ ను నెల్లూరులోని జిల్లా జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం.

వాస్తవానికి జైలుకు వెళ్లిన వైసీపీ చెందిన నేతలంతా ఆ పార్టీ అధికారంలో ఉండగా… వీర్రవీగిన కారణానే వారిని జైలు బాట పట్టించాయి. అయితే అలాంటి కారణమేమీ లేకుండానే గోరంట్ల మాధవ్ జైలుకు వెళుతుండటం గమనార్హం. పూర్వాశ్రమంలో సర్కిల్ ఇన్ స్పెక్టర్ స్థాయిలో పోలీసు అధికారిగా పనిచేసిన మాధవ్ కు.. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిపై దాడికి యత్నిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయన్న విషయంపై సంపూర్ణ అవగాహన ఉండే ఉంటుంది. అయితే తాను ఓ మాజీ ఎంపీని అంటూ మాధవ్ విర్రవీగిన తీరు నిజంగానే పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చినా… తాను ఇంకా పోలీసు అధికారిననే ఆయన చెప్పుకుంటున్న తీరు కూడా వివాదాస్పదంగా మారింది.

గురువారం మధ్యాహ్నానికే పోలీసుల అదుపులోకి వెళ్లిపోయిన చేబ్రోలు కిరణ్ పై మాధవ్ రెండు పర్యాయాలు దాడికి యత్నించారని తాజాగా పోలీసుటు తెలిపారు. మంగళగిరి నుంచి కిరణ్ ను పోలీసులు గుంటూరు తరలిస్తున్న విషయాన్ని పసిగట్టిన మాధవ్… పోలీసు వాహనాన్నే వెంబడిస్తూ సాగారు. గుంటూరు నగరంలోని చుట్టుగుంట సెంటర్ వద్ద ఓ సారి… ఎస్పీ కార్యాలయం వద్ద మరోమారు కిరణ్ పై మాధవ్ దాడికి యత్నించారట. ఈ క్రమంలోనే ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న పోలీసులు మాధవ్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ సెక్షన్ల కారణంగానే మాధవ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. పలితంగా ఇప్పుడు మాధవ్ నెల్లూరు జైలుకు వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.