డోలీ మోతలు… గిరిజన గూడేల్లో నిత్యం కనిపించే కష్టాలు. పట్టణ ప్రాంతాలు ఎంతగా అభివృద్ది చెందుతున్నా.. పూర్తిగా అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గిరి పుత్రులకు రవాణా సౌకర్యాలు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఫలితంగా అనారోగ్యం బారిన పడినా, ప్రసవ వేదన మొదలైనా, మెరుగైన చికిత్సల కోసమైనా గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. అయితే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనకు అందిన అదికారంతో పల్లె సీమలకు సంపూర్ణంగా రహదారి సౌకర్యాలు ఏర్పాటు చేసే దిశగా సాగుతున్నారు. ఈ క్రమంలో గిరిజన గూడేలకు కూడా ఆయన రోడ్డు సౌకర్యాన్ని ఏర్పాటు చేసేందుకు సంకల్పించారు. దీనిని ఓ బృహత్కార్యంగా భావిస్తున్న పవన్ చర్యలతో గిరిజనుల డోలీ మోతల నుంచి మోక్షం లభించనుందని మాత్రం చెప్పవచ్చు.
గిరిజన గూడేలకు రోడ్డు మార్గాలను ఏర్పాటు చేసేందుకు పవన్ కల్యాణ్ ”అడవి తల్లి బాట” పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమా నికి శ్రీకారం చుడుతున్నారు. సోమవారం ఈ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు జిల్లాలో సోమవారం ఆయన అంకురార్పణ చేయనున్నారు. ఇందుకోసం సోమవారం అరకు వెళ్లనున్న పవన్…మంగళవారం కూడా గిరిజన గ్రామాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సోమవారం అరకు పరిధిలోని డుంబ్రిగూడ మండలం పెదపాడు గూడేనికి వెళ్లి గిరిజన ఆవాసాలను పరిశీలిస్తారు. అనంతరం ఆ గూడెంలోనే ఏర్పాటు చేసే బహిరంగ సభలో అడవి తల్లి బాటకు పవన్ శ్రీకారం చుడతారు. అనంతరం అరకు మండలం సుంకరమెట్టకు వెళ్లతనున్నారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన ఉడెన్ బ్రిఃడ్జిని ఆయన ప్రారంభిస్తారు. ఈ పర్యటనలో పలు గిరిజన గూడేల్లో పవన్ కాలి బాటన పరిశీలిస్తారని సమాచారం.
పవన్ పర్యటనతో ఒక్కసారిగా గిరిజనుల డోలీ కష్టాలకు తెర పడుతుందని చెప్పలేం గానీ… ఆ దిశగా ఓ కీలక అడుగు అయితే పడుతుందని చెప్పాలి. అంతేకాకుండా రానున్న నాలుగేళ్లలో చాలా గిరిజన గూడేల రూపురేఖలు సమూలంగా మారిపోనున్నాయని చెప్పక తప్పదు. అంతేకాకుండా చాలా గిరిజన గూడేలను పరిసర ప్రాంతాల్లోని మెయిన్ రోడ్డకు కలుపుతూ లింకు రోడ్లు ఏర్పాటు కావడం ఖాయమేనని చెప్పక తప్పదు. ఇప్పటిదాకా మెయిన్ రోడ్లకు లింకులు లేని కారణంగా డోలీ మోతలతో పాటుగా నాగరికత వైపుగా కూడా గిరిజనులు అడుగులు వేయలేకపోయారు. ఇప్పుడు పవన్ మార్కు అభివృద్ధితో గిరి పుత్రులు కూడా నాగరిక సమాజానికి దగ్గర కానున్నారు. వారి జీవితాలు కూడా మెరుగు పడనున్నాయని కూడా ఖచ్చితంగానే చెప్పొచ్చు. మొత్తంగా గిరిజన గూడేల రూపురేఖలు మారే దిశగా అడవి తల్లి బాటకు శ్రీకారం చుడుతున్న పవన్ తీరుపైై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.