సీఎం చంద్రబాబు ప్రకటించిన ప్రతిష్టాత్మక కార్యక్రమం పీ-4(పబ్లిక్-ప్రైవేటు-పీపుల్స్-పార్టనర్షిప్)కు ఉన్నత స్థాయి వర్గాల నుంచి స్పందన వస్తోంది. సమాజంలోని పేదలను ఆదుకుని.. వారిని విద్య, ఉద్యోగాలు, నివాసం సహా.. అన్ని కోణాల్లోనూ ఆదుకుని వారిని కూడాసంపన్నులుగా తీర్చిదిద్దడమే పీ-4 కీలక లక్ష్యం. ఈ లక్ష్య సాధనకు కలసి రావాలంటూ.. ఉన్నత స్థాయి వర్గాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో ఎంపిక చేసిన ఓ బంగారు కుటుంబాన్ని కూడా ఆయన పరామర్శించి.. పీ-4 ద్వారా వారికి అందే చేయూతను వివరించారు.
ఇక, పీ-4 కార్యక్రమానికి స్పందనగా.. ప్రముఖ విత్తన వ్యాపార సంస్థ ప్రసాద్ సీడ్స్ అధినేత.. ప్రసాద్.. సీఎం చంద్రబాబుకు 10 కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. ఈ నిధులను పీ-4 కార్యక్రమానికి వినియోగించాలని సూచించారు. ప్రధానంగా కొమ్మూరు లిఫ్ట్ ఇరిగేషన్(ఎత్తిపోతల పథకం)కు ఈ నిధులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. కొమ్మూరు పరిధిలో రైతులు సాగు నీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ఇక్కడ చేపట్టిన ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా వారికి మేలు జరుగుతుందని ఈ సందర్భంగా ప్రసాద్ పేర్కొన్నారు.
గుంటూరు జిల్లా కాకుమాను మండలం కొమ్మూరులో వేలాది ఎకరాల పంటలు.. లిఫ్ట్ ఇరిగేషన్పైనే ఆధారపడి ఉన్నాయని ప్రసాద్ తెలిపారు. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతన్నారని.. వీరిని ఆదుకునేందుకు ఈ నిధులను వినియోగించాలని ఆయన సూచించారు. ప్రసాద్ చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని.. ఆ నిధులను కొమ్మురు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు వినియోగిస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్ర జలవనరుల శాఖకు రూ.10 కోట్లను బదిలీ చేయాలని సీఎంవో వర్గాలను ఆయన ఆదేశించారు. భవిష్యత్తులోనూ.. ప్రసాద్ ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.