పోటాపోటీ నినాదాల మధ్య నాగబాబు

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో గడచి రెండు రోజులుగా టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తుతున్నాయి. జనసేన తరఫున ఇటీవలే ఎమ్మెల్సీగా ఎన్నికైన పవన్ సోదరుడు కొణిదెల నాగేంద్ర రావు అలియాస్ నాగబాబు శుక్రవారం పిఠాపురంలో అధికారిక పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా నాగబాబుకు జనసేన శ్రేణులు భారీ ఎత్తున స్వాగత సత్కారాలు చేశాయి. అదే సమయంలో టీడీపీ శ్రేణులు కూడా నాగబాబు వద్దకు చేరుకుని టీడీపీ నినాదాలతో హోరెత్తించారు. వెరసి నాగబాబు పర్యటనలో టీడీపీ, జనసేన నినాదాలు హోరెత్తాయి.

తాజాగా శనివారం పిఠాపురం పరిధిలోని కుమారపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేందుకు నాగబాబు బయలుదేరారు. ఈ సందర్భంగా నాగబాబు వెంట ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రాగా… కుమారపురం చేరుకున్న వెంటనే అక్కడ టీడీపీ శ్రేణులు కూడా ప్రత్యక్షమయ్యాయి. ఓ వైపు జై జనసేన, జై పవన్, జై నాగబాబు అంటూ జనసేన శ్రేణులు నినాదాలతో హోరెత్తిస్తే… జై టీడీపీ, జై వర్మ, జై చంద్రబాబు, జై లోకేశ్ అంటూ టీడీపీ శ్రేణులు జనసేన శ్రేణులతో పోటీ పడి మరీ నినాదాలు వినిపించాయి. ఈ సందర్భంగా అక్కడ కొంతసేపు గందరగోళం నెలకొనగా… పోలీసులకు ఎలాంటి శ్రమ కలిగించకుండానే టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటిస్తూ ఎవరి దారిలో వారు సాగిపోతూ కనిపించారు.

ఇరు పార్టీల పోటాపోటీ నినాదాల నేపథ్యంలో పిఠాపురంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయంటూ పలు మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తున్నా… నినాదాల హోరు అయితే కనిపించింది గానీ… ఎక్కడ కూడా ఇరు పార్టీల శ్రేణుల మధ్య తోపులాట గానీ, వాగ్వాదం గానీ జరిగిన దాఖలానే కనిపించలేదు. ఓ వైపు జనసేన నినాదల హోరు, మరోవైపు టీడీపీ నినాదాల హోరు వినిపిస్తున్నా… ఎలాంటి ఇబ్బంది లేకుండానే నాగబాబు అలా ముందుకు సాగిపోయారు. తాను నిర్దేశించుకున్న కార్యక్రమాలను ముగించుకున్నారు. ఇదిలా ఉంటే… ఈ కార్యక్రమాల్లో టీడీపీ ఇంచార్జీగా కొనసాగుతున్న ఎస్వీఎస్ఎన్ వర్మ మాత్రం నాగబాబు పర్యటనలో కనిపించలేదు.