రాజ‌ధాని రైతుల‌కు మ‌రో షాక్‌… ఇంకో కేసు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి రైతులు విష‌యంలో ఏపీ ప్ర‌భుత్వం నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. రాజధాని ప్రాంత రైతుల్ని నరసరావుపేట సబ్‌ జైలుకు తరలించే సమయంలో బేడీలు వేసుకుని పోలీసులు తీసుకెళ్లారు. రాజధాని ప్రాంతంలో రైతులకు బేడీలు వేయడంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది.

రైతులకు బేడీలు వేయడం ముమ్మాటికి తప్పేనని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తుండగా మరోవైపు టీడీపీ నేతలపై అధికార పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. అయితే, తాజాగా రాజ‌ధాని రైతుల‌కు ప్ర‌భుత్వం మ‌రో షాక్ ఇచ్చింది. రాజ‌ధాని ప్రాంత రైతులపై మ‌రో కేసు న‌మోదు అయింది.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు ధాన్యం పూర్తిగా నీటి పాలు అయింది. రైతులు రోడ్డుపై ధాన్యం అరబోయడంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. దీనిపై ఆగ్రహించిన రైతులు వెంటనే కేసును కొట్టి వెయ్యలని డిమాండ్ చేశారు. అమ‌రావ‌తి రైతులపై మరో కేసు కావ‌డం సంచ‌ల‌నంగా మారింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చివరకు రైతు దగా ప్రభుత్వంగా మారిందని, అకాలవర్షాలు, వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంమానేడంతోపాటు, అన్నదాతలకు బేడీలు వేసే నీచస్థాయికి దిగజారిందని, రైతులపక్షాన నిలిచినందుకు సిగ్గులేకుండా తనపై విమర్శలు చేస్తోందని టీడీపీ జాతీయప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారాలోకేశ్ మండిపడ్డారు.

ఇదిలా ఉండ‌గా, రైతులకు బేడీలు వేయడం వివాదంగా మారుతున్న నేప‌థ్యంలో వైఎస్ఆర్‌సీపీ నేత‌, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ మీడియాతో మాట్లాడారు. బేడీలు వేయ‌డం ముమ్మాటికీ తప్పేనని ఆయన అంగీక‌రించారు. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారు. దళిత రైతులకు బేడీలు వేయడంపై రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. దళితులంతా ఒక్కటేనని.. చంద్రబాబు మాయలో పడొద్దుని వ్యాఖ్యానించారు. దళితుల జీవితాలతో టీడీపీ నేతలు ఆడుకుంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.