పవన్ సహా కీలక మంత్రుల బ్లాక్ లో అగ్ని కీలలు

ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని రాష్ట్ర పాలనా యంత్రాంగానికి కీలక కేంద్రం అయిన సచివాలయంలో శుక్రవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో చెలరేగిన మంటలు ఒక్కసారిగా భారీ ఎత్తున ఎగసిపడ్డాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని అగ్ని కీలలు చుట్టుముట్టేశాయి. ప్రమాదం జరిగిన గదిలోని పరికరాలన్నింటినీ అగ్ని కీలలు దహించి వేశాయి. ఈ ప్రమాదం చోటుచేసుకున్న బ్లాక్ లోనే జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీ ఉంది. అయితే ప్రమాదం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ కావడంతో పవన్ పేషికేమీ నష్టం వాటిల్లలేదు.

సచివాలయంలోని రెండో బ్లాక్ లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేషీ ఉంది. పవన్ ఫేషీతో పాటుగా ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, హోం మంత్రి వంగలపూడి అనిత, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్. దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితరుల పేషీలు ఉన్నాయి. ఈ లెక్కన కీలక శాఖల మంత్రుల పేషీలన్నీ కూడా ఈ బ్లాక్ లోనే ఉన్నాయి. నిప్పు రవ్వలు ఎక్కడి నుంచి పడ్డాయో తెలియదు గానీ.. శుక్రవారం ఉదయం ఒక్కసారిగా ఆ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నట్టుండి అగ్ని కీలలు ఎగసిపడ్డాయి.

సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించిందన్న సమాచారంతో అగ్ని మాపక సిబ్బంది హుటాహుటీన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. గ్రౌండ్ ఫ్లోర్ లో బ్యాటరీలు పెట్టే గదిలో ఈ ప్రమాదం సంభవించినట్లు గుర్తించారు. బ్యాటరీల కారణంగానే మంటలు చెలరేగినట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే…హోం మంత్రి అనిత అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదం జరగడానికి గల కారణాలపై ఆరా తీశారు. అంతేకాకుండా జరిగిన నష్టంపైనా ఆమె వివరాలు అడిగి తెలుసుకున్నారు.