వైసీపీ కీలక నేత, లోక్ సభలో ఆ పార్టీ పక్ష నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డికి గురువారం భారీ షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో తనను సీఐడీ పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. ఈ మేరకు ఇప్పటికే ఈ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణను ముగించగా… తాజాగా గురువారం ఈ వ్యవహారంపై కోర్టు తన తుది తీర్పును వెలువరించింది. సీఐడీ నమోదు చేసిన ఈ కేసులో మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే ఆయన బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
ఢిల్లీలో ఆప్ సర్కారును కూల్చేసిన లిక్కర్ స్కాంను మించిన స్థాయిలో వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం జరిగిందని, దీనికి కర్త, కర్మ, క్రియ అంతా మిథున్ రెడ్డేనని కూటమి పార్టీలకు చెందిన నేతలు ఆరోపించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఏపీలో మద్యం కుంభకోణం జరిగిన మాట వాస్తవమేనని మొన్నటిదాకా వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా వ్యవహరించిన వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా ఇటీవలి సీఐడీ విచారణలో తేల్చి చెప్పారు. అంతేకాకుండా ఈ వ్యవహారం మొత్తాన్ని కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిందని కూడా ఆయన తెలిపారు. కసిరెడ్డి వెనుక మిథున్ రెడ్డి ఉన్నారని, మిథున్ రెడ్డి చెప్పినట్టే కసిరెడ్డి నడుచుకున్నారన్న దిశగా సీఐడీ అధికారులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం.
ఈ నేపథ్యంలో సీఐడీ విచారణను క్లోజ్ గా పరిశీలిస్తున్న మిథున్ రెడ్డి… తనను అరెస్టు చేస్తారేమోనన్న భయంతో ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును చాలా రోజుల క్రితమే ఆశ్రయించారు. మిథున్ రెడ్డి బెయిల్ పై ఇప్పటికే రెండు పర్యాయాలు విచారణ చేపట్టిన కోర్టు… సీఐడీ వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. మిథున్ రెడ్డి వాదనల కంటే సీఐడీ వాదనలే బలంగా ఉన్నాయన్న భావనతో కోర్టు… మిథున్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇవ్వలేమని తాజాగా తీర్పు చెప్పింది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వలేదంటే… మిథున్ రెడ్డికి ఈ కుంభకోణంలో ప్రత్యక్ష పాత్ర ఉన్నట్లుగా సీఐడీ ఆధారాలు చూపినట్లే కదా అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. దీంతో ఈ కేసులో మిథున్ రెడ్ది అరెస్టు ఖాయమేనన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.