వైరల్ గా హోం మినిస్టర్ వీడియో… ఏముందంటే?

ఏపీ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సోషల్ మీడియాలో బుధవారం సాయంత్రం ఓ వీడియో పోస్ట్ చేశారు. సదరు వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అంతేనా దానిని చూసిన వారంతా ఏపీ పోలీసు శాఖ తీరును అభినందించకుండా ఉండలేకపోతున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అందుబాటులోకి తీసుకువచ్చిన డ్రోన్ టెక్నాలజీని పోలీసు శాఖ ఇంత బాగా వినియోగించుకుంటుందా? అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫలితంగా ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయినా అనిత పోస్టు చేసిన ఈ వీడియోలో ఏముందన్న విషయానికి వస్తే… అది విజయనగరం జిల్లా కేంద్రంలోని ఓ మారుమూల ప్రాంతం. వాహనాల గ్యారేజీ. పని లేని లారీలను పార్క్ చేసిన ప్రాంతమది. పోలీసుల కళ్లుగప్పి పేకాట ఆడేందుకు అక్కడి పేకాటరాయుళ్లు.. ఆ ప్రాంతంలో నిలిపిన లారీని తమ వేదిక చేసుకున్నారు. పార్క్ చేసిన లారీని వారంతా ఎక్కారు. చుట్టూ లారీకున్న ట్రాలీ అంచులు వారిని బయటి వారికి కనిపించకుండా చేశాయి. ఇంకేముంది… తమను ఎవరూ గుర్తించలేరని బావించిన పేకాటరాయుళ్లు ఆటలో మునిగిపోయారు.

అయితే ఏపీ పోలీసులు ఇప్పుడు ఎక్కడికక్కడ అసాంఘీక కార్యకలాపాలకు చెక్ పెట్టే దిశగా డ్రోన్ లను వినియోగిస్తున్న సంగతి తెలిసిందే. అందులో బాగంగా ఈ లారీలో పేకాటరాయుళ్లను డ్రోన్లు గుర్తించాయి. అంతే… ఓ జీపులో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. వచ్చీరావడంతోనే ఏదో ఆపరేషన్ కు వెళ్లినట్లుగా చకచకా జీపులో నుంచి దిగిపోయి… లారీని చుట్టుముట్టారు. నలుదిక్కుల నుంచి లారీ ట్రాలీని ఎక్కేశారు. అయినా కూడా పేకాటరాయుళ్లు తమ క్రీడావిలాసంలో మునిగే ఉన్నారు. పోలీసులంతా చుట్టుముట్టిన తర్వాత గానీ.. తాము పట్టుబడిపోయామని వారు గుర్తించలేకపోయారు.

పేకాటరాయుళ్లను ఎంచక్కా ఒక్కొక్కరిగానే కిందకు దించిన పోలీసులు వారిని జాగ్రత్తగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆపై కేసులూ నమోదు చేశారు. మొన్నామధ్య పొలాల్లో, నిర్జన ప్రదేశాల్లో మద్యం తాగుతూ సేద దీరిన వారు డ్రోన్లను చూసి పరుగులు పెట్టిన దృశ్యాలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా పేకాటరాయుళ్లకూ డ్రోన్ల సహాయంతోనే పోలీసులు చెక్ పెడుతున్న తీరును అభినందించిన మంత్రి… ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంటే.. ఇక ఎలాంటి ప్రదేశంలో పేకాట ఆడాలన్నా కూడా పేకాటరాయుళ్లు జడుసుకుని తీరాల్సిందే.