ఎర్ర జెండా వాళ్లు 30 ఏళ్ల‌కు క‌ళ్లు తెరిచారు: సీఎం చంద్ర‌బాబు

క‌మ్యూనిస్టుల‌పై ఏపీ సీఎం చంద్ర‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌ప్పుడు టీడీపీతో జ‌ట్టుక‌ట్టిన సీపీఐ, సీపీఎం పార్టీలు.. త‌ర్వాత కొన్ని విధానాల‌తో చంద్ర‌బాబును వ్య‌తిరేకించిన విష‌యం తెలిసిందే. అయితే.. తాజాగా తెలంగాణ అసెంబ్లీలో క‌మ్యూనిస్టు నాయ‌కుడు, ఎమ్మెల్యే కూనంనేని సాంబ‌శివ‌రావు.. చంద్ర‌బాబుపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఉమ్మడి ఏపీలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో టూరిజంపై చేసిన వ్యాఖ్యలను తెలంగాణ అసెంబ్లీలో కూనంనేని ప్రస్తావించారు.

“ఇప్పుడు సమాజంలో ఏ ఇజం లేదు.. ఉన్నదంతా టూరిజమే అని నాడు చంద్రబాబు అనేవారు” అని కూనంనేని వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాడు ఇజంపై చెప్పిన మాటే నిజం అని కూడా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్య‌లు సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు చేరాయి. దీంతో తాజాగా ఆయ‌న కూనంనేని వ్యాఖ్య‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎర్ర జెండా వాళ్లు 30 ఏళ్ల‌కు క‌ళ్లు తెరిచారు అని అన్నారు. అంతేకాదు.. “ఏ ఇజం లేదు అని నేను నాడు అంటే కమ్యునిస్టులు నాపై విరుచుకుపడ్డారు. నాపై విమర్శలు చేశారు” అని గ‌తాన్ని బాబు గుర్తు చేసుకున్నారు.

ఇప్ప‌టికైనా వారు త‌న విజ‌న్‌ను గుర్తించినందుకు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌న్నారు. “నేను చెప్పిన మాటలను, నా ఆలోచనలను అర్ధం చేసుకోవడానికి ఎర్ర జెండా వాళ్ల‌కు 30 ఏళ్లు పట్టింది” అని వ్యాఖ్యానించారు. అయితే, ఇప్పుడు అంత సమయం లేదని, త్వరగా ప్రాజెక్టులు తెచ్చి ప్రజల జీవితాల్లో మార్పులు తేవాలని క‌లెక్ట‌ర్ల‌కు సీఎం చంద్ర‌బాబు సూచించారు. రాష్ట్రంలో ఇటు రాయలసీమ నుంచి అటు ఉత్తరాంధ్ర వరకు టూరిజం అభివృద్దికి అనేక అవకాశాలు ఉన్నాయని తెలిపారు.

అమ‌రావ‌తి స‌చివాల‌యంలో జ‌రుగుతున్న క‌లెక్ట‌ర్ల స‌ద‌స్సులో సీఎం చంద్ర‌బాబు రెండో రోజు ప్ర‌సంగిస్తూ.. కలెక్టర్లు జిల్లాల వారీగా టూరిజం అభివృద్ది ప్రాజెక్టులపై శ్రద్ద పెట్టాలని సూచించారు. ఈద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, ఎకనమీ పెరిగి, ప్రభుత్వ ఆదాయం పెరుగుతుందని చెప్పారు. అదేస‌మ‌యంలో ఎక్కువ ఖర్చు లేకుండా ఉపాథి కల్పించే రంగం టూరిజం అని వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా పనిచేస్తే టూరిజం పెద్ద ఉపాధి మార్గం అవుతుందని సీఎం చంద్రబాబు స్ప‌ష్టం చేశారు.