స్థానిక సంస్థల్లో వైసీపీ పట్టుకోల్పోతోంది. 2021లో జరిగిన ఎన్నికల్లో ఏకబిగిన రాష్ట్ర వ్యాప్తంగా దుమ్ము దులిపిన వైసీపీ.. ఇప్పుడు మాత్రం ఆ హవాను దాదాపు పోగొట్టుకుంటోందనే చెప్పాలి. ప్రస్తుతం కడప మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు పడుతుండగా.. మరోవైపు.. ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులోనూ.. స్థానికం కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇక, ఇప్పటికే పలు చోట్ల వైసీపీ జెండా జారి.. టీడీపీ జెండా ఎగురు తున్న పరిస్థితి కనిపిస్తోంది.
కడపలో వైసీపీకి మంచి బలం ఉంది. దీంతో టీడీపీ ఇక్కడ పాగా వేయడం సాధ్యం కాదని అర్ధమైంది. దీంతో మేయర్ సురేష్బాబు చేసిన తప్పులను ఆయుధంగా మార్చుకున్న టీడీపీ.. ఆయన పై అనర్హత వేటుకు రంగం రెడీ చేసింది. తాజాగా సురేష్బాబుకు ఎందుకు అనర్హత వేయకూడదో చెప్పాలంటూ షోకాజ్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆయన కు చెందిన కుటుంబ కాంట్రాక్టు సంస్థకు పనులు అప్పగించి..రూ.కోట్లు జేబులో వేసుకున్నారని.. ఇది నిబంధనలకు వ్యతిరేకమని ప్రభుత్వం చెబుతోంది.
ఇప్పుడు.. తిరువూరు నగరపాలక సంస్థ వచ్చింది. ఇక్కడి ఛైర్మన్ విషయంలో వైసీపీ కౌన్సిలర్ల మధ్య విభేదాలు నెలకొన్నాయి. దీంతో చైర్ పర్సన్ కస్తూరిబాయి తన పదవికి రాజీనామా చేశారు. ఆమె రాజీనా మా పత్రాన్ని భర్త నాగేశ్వరరావు.. నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్కు అందజేశారు. ఇక, ఇప్పుడు టీడీపీ రంగంలోకి దిగింది. ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే రక్షణనిధి చక్రం తిప్పుతున్నారు.
చైర్ పర్సన్ కుర్చీని తన వర్గానికి చెందిన మోదుగు ప్రసాద్కు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. అయితే.. రక్షణ నిధి ఇప్పుడు వైసీపీలో లేకపోవడం గమనార్హం. దీంతో ఇక్కడ టీడీపీ హవా పెరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఆయన త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుని.. ఆవెంటనే తనకు మద్దతుగా ఉన్న 12 మంది కౌన్సిలర్లను టీడీపీ సైకిల్ ఎక్కించే ఏర్పాట్లు ఏస్తున్నారు. దీంతో తిరువూరులో 17మంది వైసీపీ సభ్యులు కాస్తా.. 5 లేదా ఆరుకు తగ్గనున్నారు. మొత్తానికి తిరువూరు కూడా వైసీపీ ఖాతా నుంచి జారిపోతున్న సంకేతాలు అయితే బలంగానే కనిపిస్తున్నాయి.