ఢిల్లీ లో రేవంత్… ఆ సారైనా గ్రీన్ సిగ్నల్ లభించేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో కలిసి బయలుదేరిన రేవంత్…ఇప్పటికే ఢిల్లీలో ఉన్న టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ను కూడా తమ బృందంతో కలుపుకుని కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలతో భేటీ కానున్నారు. ఈ భేటీపై కాంగ్రెస్ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కేబినెట్ లో ఇంకో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సారైనా ఈ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ లభిస్తుందా? అన్న దిశగా ఆసక్తికర చర్చ నడుస్తోంది.

కేబినెట్ లో విద్య హోం శాఖ వంటి ఆరు మంత్రిత్వ శాఖలన్నీ సీఎం రేవంత్ వద్దే ఉన్నాయి. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పదవి కూడా ఖాళీగానే ఉంది. అదే సమయంలో టీపీసీసీ కార్యవర్గం కూర్పుకూడా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉంది. వాటితో పాటుగా అసెంబ్లీలో చీఫ్ విప్ పదవి కూడా ఖాళీగానే ఉంది. ఇక నామినేటెడ్ పోస్టుల సంగతి తెలిసిందే. అయితే ఈ దఫా అధిష్ఠానం నుంచే ఢిల్లీ రావాలంటూ రేవంత్ కు సమాచారం వచ్చిన నేపథ్యంలో…ఖాళీగా ఉన్న మంత్రి పదవులతో పాటుగా మిగిలిన దాదాపుగా అన్ని పదవుల భర్తీకి అధిష్ఠానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

అధిష్ఠానంతో రేవంత్ బృందం చర్చల్లో భాగంగా తొలి విడతగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తో రేవంత్ భేటీ కానున్నారు. ఈ భేటీలో తెలంగాణలో పోస్టుల భర్తీపై అధిష్ఠానం వైఖరేమిటన్నది రేవంత్ బృందానికి తెలియనున్నట్లుగా సమాచారం. అధిష్ఠానం ఆలోచన తెలిసిన తర్వాత ఎలా ముందుకు సాగాలన్న దానిపై రేవంత్ సమాచాలోచనలు చేయ నున్నట్లు సమాచారం. వాస్తవానికి అందుబాటులో ఉన్న పోస్టులు వేళ్లపై లెక్కపెట్టేంతగా ఉంటే… పదవులను ఆశిస్తున్న వారు మాత్రం వందలు, వేల సంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికీ అసంతృప్తి లేకుండా ఉండేలా అడుగులు వేయాలన్న దిశగా అటు అధిష్టానం, ఇటు రేవంత్ వర్గం జాగ్రత్తగా చర్యలు చేపట్టనుంది. ఈ లెక్కన ప్రస్తుతానికి నాలుగు మంత్రి పదవులను మాత్రం భర్తీ చేసేందుకు అనుమతి లబించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.