ఏపీలో క్రిష్టియానిటీ పెరిగింది…మోడీకి రఘురామ లేఖ

ఏపీలో వైసీపీకి స్వపక్షంలో విపక్షంలా మారిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సొంతపార్టీపైనే సందర్భానుసారంగా తీవ్ర విమర్శలు గుప్పిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలను రఘురామ తీవ్రంగా ఖండించిన సంగతి తెలిసిందే. దీంతోపాటు, ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత క్రిష్టియానిటీ పెరుగుతోందని రఘురామ సంచలన ఆరోపణలు చేశారు.

రికార్డుల ప్రకారం ఏపీలో 1.8 శాతం క్రిష్టియానిటీ ఉందని, కానీ, వాస్తవానికి అది 25 శాతం ఉందని రఘురామ అన్నారు. ఎంతోమంది ప్రజాప్రతినిధులు క్రిష్టియన్లని, కానీ,ఎన్నికలలో గెలిచేందుకు హిందువులమని చెప్పుకుంటూ నిరంతరం చర్చిల్లో తిరుగుతున్నారని షాకింగ్ కామెంట్లు చేశారు. ఆ వివరాలను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు లీగల్ ప్రొటెక్షన్ ఫోరం వారు సమర్పించారని,, త్వరలో ఆ వివరాలల్నీ బయటకు వస్తాయని రఘురామ గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోడీకి కూడా రఘురామ ఈ వ్యవహారంపై తాజాగా లేఖ రాశారు.

ఏపీలో యథేచ్ఛగా మత మార్పిడులు జరుగుతున్నాయని, 2011లో 1.8 శాతంగా ఉన్న క్రిష్టియన్ల జనాభా 2020 నాటికి 25 శాతానికి పెరిగిందని రఘురామ లేఖలో పేర్కొన్నారు. కానీ, ఆ గణాంకాలు ప్రభుత్వ రికార్డుల్లో లేవని, అనధికారికంగా ఉన్నాయని అన్నారు. ఏపీలో ప్రజాధనాన్ని క్రిస్టియన్ మత వ్యాప్తికి ఉపయోగిస్తున్నారని,ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు.

ఏపీలో 30 వేల మంది చర్చి పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు ఇచ్చేలా జీవో వచ్చిందని, ఇటీవల ఏపీలో 33 వేల చర్చిలు ఏర్పాటైనట్టు సమాచారం ఉందని అన్నారు. గుళ్లకు సమాన సంఖ్యలో చర్చిలను ఏర్పాటు చేశారని, 2021 జనాభా లెక్కల్లో మత మార్పిడి చేసుకున్న వారిని గుర్తించి అర్హులకు మాత్రమే రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాజాగా రఘురామ రాసిన లేఖపై మోడీ ఏ విధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.