రేవంత్ రెడ్డి ‘తెలంగాణ’ను గెలిచారు!

నిజమే… తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి యావత్తు రాష్ట్రాన్ని గెలిచారు. అదేంటీ… 2023 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే… ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చిన రేవంత్ సీఎం సీటుపై కూర్చున్నారు కదా. ఇప్పుడు తెలంగాణను ఆయన గెలవడం ఏమిటి అంటారా? సోమవారం నాటి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను కాస్తంత లోతుగా పరిశీలిస్తే… నిజంగానే రేవంత్ రెడ్డి తెలంగాణను గెలిచారు అని ఒప్పుకుని తీరతారు.

నిజమే మరి.. 2023 ఎన్నికల్లో రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ సగానికి పైగా అసెంబ్లీ సీట్లను మాత్రమే గెలిచింది గానీ… అన్ని సీట్లను గెలవలేదు కదా. అందుకేగా…ఇప్పుడు అసెంబ్లీలో కాంగ్రెస్ అధికార పక్షంగా ఉండగా… బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ లాంటి పార్టీలు విపక్షాలుగా ఉన్నాయి కదా. అంటే… నాడు తెలంగాణను రేవంత్ సంపూర్ణంగా గెలవలేదు. అయితే సోమవారం రేవంత్ సర్కారు ప్రవేశపెట్టిన బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సభలోని అన్ని పక్షాలు మద్దతు పలికాయి. అంటే…రేవంత్ ప్రతిపాదనకు మిత్రపక్షం సీపీఐతో పాటుగా విపక్షాలు బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్… అందరూ రైట్ చెప్పేశారు. అంటే రేవంత్ తెలంగాణను గెలిచేసినట్టే కదా.

ఇటీవలే తెలంగాణలో రేవంత్ సర్కారు కుల గణనను చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కుల గణనలో ఏ కుల జనాభా ఎంత ఉందో అంతే స్థాయిలో ఆ వర్గాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అందాలన్న దిశగా రేవంత్ సర్కారు సాగింది. కుల గణనలో బీసీల 42 శాతం ఉన్నట్లుగా తేలగా… ఆ మేరకు బీసీల రిజర్వేషన్లను ఒకేసారి 4 శాతానికి పెంచుతూ ఓ బిల్లు రూపొందించింది. సదరు బిల్లును సోమవారం నాటి సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు ఎలాగూ అదికార పక్షం కాంగ్రెస్, మిత్రపక్షం సీపీఐ ఆమోదం తెలపగా… విపక్షాలుగా ఉన్న బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీలు కూడా అనూహ్యంగా ఆమోదం తెలిపాయి. పలితంగా రేవంత్ రెడ్డి యావత్తు తెలంగాణను జయించేసినట్లేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.