లోకేశ్ గెలిచారు!… మంగళగిరి మారిపోతోంది!

మంగళగిరి… నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి పరిధిలోని కీలక అసెంబ్లీ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం కేంద్రంగానే రాజకీయం మొదలుపెట్టిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్…తొలిసారి ఎదురు దెబ్బ తగిలినా…పట్టు వదలని విక్కమార్కుడి మాదిరిగా రెండోసారి కూడా అక్కడినుంచే పోటీ చేసి విజయం సాధించారు. తనను గెలిపిస్తే…నియోజకవర్గ రూపురేఖలను మార్చేస్తానని ఆయన 2019లోనే చెప్పిన సంగతి తెలిసిందే. అనుకున్నట్లుగానే 2024లో లోకేశ్ ను అక్కడి ప్రజలు రికార్డు మెజారిటీతో గెలిపించారు. లోకేశ్ కూడా తాను ఇచ్చిన మాట ప్రకారంగా నియోకజవర్గ రూపు రేఖలను మార్చేస్తున్నారు.

ఇప్పటికే నియోజకవర్గంలో ఓ రేంజిలో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయి. కొన్ని పనులను ప్రభుత్వ నిధులతో చేపడుతున్న లోకేశ్..మరికొన్ని పనులను తన సొంత నిధులతో చేపడుతున్నారు. అంతేకాకుండా తనకు తెలిసిన కొన్ని కంపెనీలను మంగళగిరి కేంద్రంగా సేవా కార్యక్రమాలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్నారు. ఫలితంగా మంగళగిరిలో అభివృద్ది పనులు పరుగులు పెడుతున్నాయి. తాజాగా మంగళగిరిలో స్వచ్ఛ మంగళగిరి మిషన్ లో భాగంగా చెత్త సేకరణకు వినియోగించే ఎలక్ట్రిక్ వాహనాలు మంగళగిరికి చేరాయి. లోకేశ్ చొరవ కారణంగా హిందూస్థాన్ కోకా-కోలా బీవరేజేస్ కంపెనీ తన సీఆర్ఎస్ ప్రొగ్రాం షైన్ కింద ఈ వాహనాలను మంగళగిరి మునిసిపాలిటీకి అందజేసింది.

ఈ సందర్భంగా సోమవారం మంగళగిరిలో మంత్రి లోకేశ్ సమక్షంలోనే హిందూస్థాన్ కోకా-కోలా బీవరేజేస్ ప్రతినిధులు ఎలక్ట్రిక్ వాహనాలను మునిసిపాలిటీ అధికారులకు అందజేశారు. ఈ విషయాన్ని స్వయంగా లోకేశే తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించారు. స్వచ్ఛ మంగళగిరి మిషన్ లో భాగంగా ఇకపై అన్నీ పర్యావరణ హిత చర్యలనే ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. హిందూస్థాన్ కోకా-కోలా బీవరేజేస్ కంపెనీ అందజేసిన ఎలక్ట్రిక్ వాహనాల ద్వారా ఎలాంటి కాలుష్యం వెలువడని రీతిలో చెత్త సేకరణను చేపట్టే అవకాశం లభించిందని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని చర్యలను చేపట్టడం ద్వారా స్వచ్ఛ మంగళగిరి మిషన్ ను సుసంపన్నం చేస్తామని ఆయన తెలిపారు.