ఏపీలో విపక్ష పార్టీ వైసీపీలో ఓ వింత పరిస్థితి కొనసాగుతోంది. పార్టీకి చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి…సామాన్య కార్యకర్త దాకా… పార్టీ రాష్ట్ర సమన్వయకర్త హోదాలో కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డిపై పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం అవుతోంది. వైసీపీ అధికారంలో ఉండగా ప్రభుత్వ సలహాదారుగా కొనసాగిన సజ్జల…విపక్షాల చేత సకల శాఖా మంత్రిగా పిలిపించుకున్న సంగతి తెలిసిందే. ప్రతి విషయంలో సజ్జల జోక్యం అంతకంతకూ పెరిగిపోయిందని…పార్టీలో ఏం జరుగుతున్న దానిని పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వద్దకు చేరకుండా అడ్డుకున్నారని… ఫలితంగానే 2024 ఎన్నికల్లో పార్టీ ఘోరంగా పరాభవం చవిచూడాల్సి వచ్చిందని పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. అయినప్పటికీ పార్టీలో సజ్జల హవా ఇప్పటికీ ఇసుమంత కూడా తగ్గలేదనే చెప్పాలి. అంతేనా… జగన్ అందుబాటులో లేకుంటే సజ్జలనే అన్నీ తానై వ్యవహరిస్తున్నారని కూడా చెప్పక తప్పదు.
ఆదివారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం నుంచి సజ్జల పార్టీకి చెందిన ఓ కీలక అంశంపై టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇంచార్జీలు, జిల్లా అధ్యక్షులు, రీజనల్ కో ఆర్డినేటర్లు, ఆయా అనుబంధ విభాగాల అధ్యక్షులు.. మొత్తంగా పార్టీకి చెందిన కీలక నేతలంతా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పార్టీలో అన్నిస్థాయిలో కమిటీలను తక్షణమే భర్తీ చేయాలని సజ్జల ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయంలో అలక్ష్యాన్ని సహించేది లేదని జగన్ చెప్పినట్లుగా ఆయన తెలిపారు. రీజనల్ కో ఆర్డినేటర్ల నుంచి నియోజకవర్గ స్థాయి నేతలంతా అందుబాటులో ఉంటారని… వారి సహకారంతో పార్టీ కమిటీలను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. ఇక పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపే దిశగా సాగిన సజ్జల… మొన్నటి ఫీజు పోరు నిరసనలను రాష్ట్రవ్యాప్తంగా విజయవంతం చేశారంటూ అందరినీ భుజం తట్టారట.
పార్టీనే కాకుండా రాజకీయాలనే వదిలేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సహా… సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్, ఇంకా చాలా మంది నేతలు సజ్జల తీరుతో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని బహిరంగంగానే ఆరోపించిన సంగతి తెలిసిందే. నేరుగా సజ్జల పేరును వారు తీయకున్నా… జగన్ చుట్టూ చేరిన కోటరీ అంటూ సజ్జలను వారంతా సంబోధించారు. ఇవన్నీ జగన్ కు తెలియవని అనుకోవడానికి లేదు. ఎందుకంటే… 151 సీట్లతో బలీయంగా ఉన్న పార్టీ వై నాట్ 175 అంటూ ఎన్నికల్లోకి వచ్చి 11 సీట్లకు పరిమితమైన తర్వాత అయినా… దానికి కారణాలు ఏమిటన్న దానిపై ఆరా తీసి ఉంటారు కదా. అయినప్పటికీ ఇంకా సజ్జల టెలీ కాన్ఫరెన్సులు, పార్టీ కీలక సమావేశాలను నిర్వహిస్తున్న తీరు చూస్తుంటే… సజ్జలను సైడ్ చేయడమో, ఆయనే సైడ్ కావడమో జరిగే పని కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.