నిజమే… నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి సెలవు రోజైన ఆదివారం రూ.11 వేల కోట్ల రుణం అందింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (హడ్కో) రాజధాని అమరావతికి రూ.11 వేల కోట్ల మేర రుణాన్ని ఇచ్చేందుకు చాలా రోజుల క్రితమే ఒప్పుకుంది. కూటమి సర్కారు అదికారం చేపట్టిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కేంద్రం పెద్దలతో పాటు తను ఉన్న పరిచయాలను యాక్టివేట్ చేసి…హడ్కో రుణం సాధించిన సంగతి తెలిసిందే.
ఈ రుణానికి సంబంధించిన విధి విధానాలు పూర్తి కాగా… కేపిటల్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీ (సీఆర్డీఏ)తో హడ్కో ఒప్పందం జరగాల్సి ఉంది. ఇప్పటికే అన్ని స్థాయిలో చర్చలు సఫలం కాగా… ఒప్పందం కేవలం లాంఛనమేనన్న వాదనలు వినిపించాయి. తాజాగా ఆదివారం నాడు ఆ లాంఛనం కూడా పూర్తి అయిపోయింది. ఢిల్లీ నుంచి హడ్కో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుల్ కృష్ణ ఆదివారం అమరావతి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ సమక్షంలో సీఆర్డీఏ అధికారులతో ఆయన ఒప్పందంపై సంతకాలు చేశారు.
అమరావతి నిర్మాణం కోసం ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ది బ్యాంకుల నుంచి రూ.15 వేల కోట్ల మేర రుణం కూడా లభించిన సంగతి తెలిసిందే. ఈ రుణానికి కేంద్ర ప్రభుత్వమే గ్యారెంటీ ఇచ్చింది. ఈ నిధుల విడుదలకు లాంఛనాలు ఇప్పటికే పూర్తి కాగా… తాజాగా హడ్కో నుంచి కూడా రూ.11 వేల కోట్ల మేర రుణం మంజూరు కావడంతో ఇక అమరావతి పనులు జెట్ స్పీడును అందుకోనున్నాయి. ఈ రెండు రుణాల ద్వారానే ఏకంగా రూ.26 వేల కోట్ల మేర నిధులు అందుబాటులోకి రానున్న నేపథ్యంలో రాజదానిలో నిర్మాణ పనుల కోసం కూటమి సర్కారు టెండర్లకు కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసిన సంగతి తెలిసిందే.