ఏపీలోని కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు అందుకునే ఈ నిర్ణయం ద్వారా ఉత్తమ పనితీరు కనబరచిన ప్రజా ప్రతినిధులకు అవార్డులు ఇవ్వనుంది. తద్వారా మరింత మంది ప్రజా ప్రతినిధుల పనితీరును మెరుగుపరిచే దిశగా చర్యలు చేపట్టనుంది. ఈ మేరకు శనివారం ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు ఇచ్చే కార్యక్రమానికి రూపకల్పన చేసింది. ఈ కార్యక్రమం ద్వారా ఆయా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాలకు చెందిన ప్రజలకు మరింత చేరువ అవుతారని… ఫలితంగా ఆయా ప్రాంతాల సమస్యలు ఇట్టే పరిష్కారం అవుతాయన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
2024 సార్వత్రిక ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కూటమి… టీడీపీ, జనసేన, బీజేపీల కలయికతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సరికొత్త విధానాలతో సాగుతున్న కూటమి సర్కారు.. ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. ఏ కార్యక్రమం చేపట్టినా…. అంతిమంగా రాష్ట్ర ప్రజలకు ఏ మేర మేలు జరుగుతుందన్న దానినే గీటురాయిగా పరిగణిస్తూ సాగుతోంది. ఈ క్రమంలోనే ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గాల్లో మరింత లోతుగా వెళ్లగలిగితే… ఫలితాలు అద్బుతంగా ఉంటాయన్న బావనతో ఈ కొత్త కార్యక్రమానికి తెర తీసినట్లు సమాచారం.
ఈ కార్యక్రమంలో భాగంగా తమ నియోజకవర్గాల ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటుగా వాటిని ఇటు అసెంబ్లీలోనే.. అటు పార్లమెంటులోనో ప్రస్తావించడం ద్వారా… వాటిని ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడం, ఆయా సమస్యల పరిష్కారం కోసం చర్యలు చేపట్టడం వంటి కార్యక్రమాల ఆధారంగా ఉత్తమ లెజిస్లేటర్ పేరిట ఎమ్మెల్యేలకు, ఉత్తమ పార్లమెంటేరియన్ పేరిట పార్లమెంటు సభ్యులకు అవార్డులను అందించాలని ప్రభుత్వం తీర్మానించింది. ఈ విషయంలో పార్టీలతో సంబంధం లేకుండా ఆయా ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు ఆధారంగానే అవార్డులను ఇవ్వనున్నారు. ఈ అవార్డుల ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ కమిటీ పార్టీలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా ఉత్తమ ప్రజా ప్రతినిధులను ఎంపిక చేయనుంది.