టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడుకు శనివారం (మార్చి 15) మరిచిపోలేని రోజు. ఎందుకంటే… సరిగ్గా 47 ఏళ్ల క్రితం ఇదే రోజున ఆయన శాసన సభ్యుడిగా తొలి సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ నాటి నుంచి ఇక ఆయన రాజకీయంగా తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఈ 47 ఏళ్ల రాజకీయ జీవితంలో ఓ ఐదేళ్లు మినహా 41 ఏళ్ల పాటు ఆయన శాసనసభ్యుడిగానే కొనసాగుతూనే ఉన్నారు. 28 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యే అయిన చంద్రబాబు… 30 ఏళ్లకే మంత్రి కూడా అయ్యారు. అంతేనా… తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలోనే ఆయన మంత్రిగా కూడా అవకాశం దక్కించుకున్నారు.
శనివారం స్వర్ణాంధ్రా-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో పర్యటించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి పట్టణంలో స్వయంగా చీపురు చేతబట్టి చెత్త ఊడ్చారు. చెత్తను తట్టల్లోకి ఎత్తారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికుడి యూనిఫాం వేసిన చంద్రబాబు… పారిశుద్ధ్య కార్మికులతో ముచ్చటించారు. వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి జీవన స్థితిగతులను మార్చే దిశగా చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇందులో పట్టణ ప్రజలను కూడా భాగస్వాములను చేయాల్సి ఉందని తెలిపారు.
అనంతరం పట్టణ ప్రజలతో మాట్లాడిన సందర్భంగా తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు… తాను తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు ఇదే (మార్చి 15) అని గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో కొనసాగుతున్న తనను… ఏకంగా 41 ఏళ్ల పాటు చట్ట సభల్లోనే ఉండేలా తెలుగు ప్రజలు దీవిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఉమ్మడి రాష్ట్రంలో 9 ఏళ్ల పాటు సీఎంగా వ్యవహరించి… అత్యధిక కాలం సీఎంగా పనిచేసిన నేతగా రికార్డులకెక్కానని తెలిపారు. ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనే పదేళ్ల పాటు ప్రతిపక్ష నేతగానూ కొనసాగానని తెలిపారు.
తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏపీకి తొలి సీఎంగా తనకే రాష్ట్ర ప్రజలు బాధ్యతలు అప్పగించారని చంద్రబాబు అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాష్ట్ర పురోభివృద్ధికి ఎంతగానో కృషి చేశానని, ఆ దిశగా కృషి చేస్తూనే ఉంటానన్నారు. విభజిత ఏపీలోనూ ఐదేళ్ల పాటు విపక్ష నేతగా ఉన్న తనను మరోమారు సీఎంగా చేశారన్నారు. ఇన్నేళ్ల పాటు తనపై నమ్మకం ఉంచుతూ ఇన్నేసి సార్లు తనను గెలిపిస్తూ వస్తున్న ప్రజలకు తాను రుణపడి ఉన్నానని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. ఇన్నేళ్ల పాటు రాజకీయాల్లో ఉన్నా గానీ… ఏనాడూ చంద్రబాబు లోక్ సభకు పోటీ చేయకపోవడం గమనార్హం. ఎప్పుడు పోటీ చేసినా… ఆయన శాసనసభ్యుడిగానే పోటీ చేస్తూ వస్తున్నారు.