పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు జనసేన నేతలు, కార్యకర్తలు వేలాదిగా తరలివచ్చారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ నాగబాబు…మాజీ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు. రాబోయే ఎన్నికల్లో విజయం తమదేనని జగన్ కలలుకంటున్నారని, ఆయన కన్నా అద్భుతంగా ఎవరూ హాస్యం పండించలేరని నాగబాబు చురకలంటించారు. జగన్ మరో 20 ఏళ్లు ఇలాగే కలలుకనాలని సలహా ఇచ్చారు.
కళ్ళు మూసి తెరిచేలోపు తొమ్మిది నెలలు గడిచిపోయాయని, కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్లు గడిచిపోతాయని ఆ తర్వాత అధికారం తమదేనని జగన్ కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. అధికారం వచ్చింది కదా అని జనసేన నేతలు, కార్యకర్తలు, వీర మహిళలు ఎవరూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దని నాగబాబు సూచించారు. అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఏం జరుగుతుందో వైసీపీ నేతలను చూసి నేర్చుకోవాలని అన్నారు. నోటి దురుసు ఉంది కాబట్టే వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదని చెప్పారు.
రాబోయే రెండు మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్ అని ప్రశంసించారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోరే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, అటువంటి గొప్ప వ్యక్తి కావాలని, లేదంటే ఆయన అనుచరుడిగా ఉండాలని అన్నారు. దేవుడు అడిగితేనే వరమిస్తాడని, పవన్ అడగకుండానే వరమిస్తాడని నాగబాబు అన్నారు. 12 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా పవన్ తట్టుకుని నిలబడ్డారని, రాబోయే 20 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ స్వర్ణ యుగం చూడబోతుందని అన్నారు.
పిఠాపురంలో పవన్ విజయానికి తానే కారణం అని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అని నాగబాబు చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పవన్ తో పాటు పిఠాపురం పౌరులే పవన్ విజయానికి కారణమని నాగబాబు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.