ఏపీలో అధికార కూటమిలోని కీలక భాగస్వామి జనసేన శుక్రవారంతో 11 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోనుంది. ఈ అరుదైన సందర్భాన్ని పురస్కరించుకుని ఆ పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం పరిధిలోని చిత్రాడలో శుక్రవారం జనసేన ఆవిర్భావ దినోత్సవాలు ఘనంగా జరిగేందుకు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఈ సభకు పవన్ కల్యాణ్ ‘జయకేతనం’ అనే పేరు పెట్టారు. జనసేన.. జయకేతనం… ప్రాసతో కూడిన రీసౌండ్ శుక్రవారం ఏపీని ఓ ఊపు ఊపేయనుందని చెప్పక తప్పదు.
జనసేన ప్రస్తుతానికి ఓ ప్రాంతీయ పార్టీ కిందే లెక్క. అయితే దేశంలో ఏ ఒక్క పార్టీకి సాధ్యం కాని రీతిలో 100 శాతం స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన భారత ఎన్నికల చరిత్రలో ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. దేశ చరిత్రలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయం సాధించిన పార్టీ ఇప్పటిదాకా లేదనే చెప్పాలి. సమీప భవిష్యత్తులో ఆ తరహా సత్తా చాటే పార్టీ కూడా లేదని కూడా చెప్పాలి. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన ఉత్సాహంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను జనసేన అత్యంత ఘనంగా నిర్వహిస్తోంది.
జయకేతనం ఏర్పాట్లు చూస్తే… జనసేన తాను ఓ ప్రాంతీయ పార్టీ అన్న భావనలో లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో ఓ జాతీయ స్థాయి పార్టీనో… లేదంటే కేంద్రంలో రికార్డు మెజారిటీతో అధికారాన్ని అందుకున్న పార్టీలో నిర్వహించే స్థాయిలో జయకేతనానికి జనసేన ఏర్పాట్లు చేస్తోందని చెప్పక తప్పదు. జనసేన ఆవిర్భావ వేడుక ఏర్పాట్ల గురించిన వివరాల్లోకి వెళితే… వాహనాల పార్కింగ్ కోసం ఏకంగా 5 ప్రాంతాలను తీర్చిదిద్దారు. సభకు వచ్చే వారి క్షేమం కోసం 14 అంబులెన్స్ లను అందుబాటులో ఉంచిన జనసేన.. ఏకంగా 7 మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ సౌకర్యాలు అపోలో ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు అవుతున్నాయి.
ఇక సభకు వచ్చే జన సైనికులు, సామాన్య ప్రజలు, పవన్ కల్యాణ్ అభిమానుల కోసం మంచి నీళ్లతో పాటు మజ్జిగను అందించేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా సభకు హాజరయ్యే వారందరినీ కడుపు నిండా భోజనం పెట్టే ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి అయ్యాయి. వీటన్నింటినీ నిత్యం పర్యవేక్షిస్తున్న పవన్… సభకు వచ్చే వారి కోసం ప్రత్యేకంగా కొన్ని రకాల పండ్లను అందించాలని సూచించారట. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో లభ్యమయ్యే పండ్లను సభకు వచ్చే వారికి అందించనున్నారు. మొత్తంగా జయకేతనంతో జనసేన రేంజి నిజంగానే ఎల్లలు దాటడం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి.