త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు దేశంలో ఒంటరిగా మారిపోతోంది. లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తున్న తమిళనాడు అధికార పార్టీ డీఎంకే… త్రిభాషా విధానాన్ని తెర మీదకు తీసుకుని వచ్చి కేంద్రంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమైంది. ఇలాంటి పరిస్థితుల్లో దక్షిణాది రాష్ట్రాలు తనకు మద్దతుగా నిలుస్తాయని కూడా తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ భావించారు. అయితే స్టాలిన్ కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారి చంద్రబాబునాయుడు మొన్నామథ్య స్టాలిన్ తీరును తప్పుబడితే… తాజాగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్… స్టాలిన్ పేరెత్తకుండానే ఒకింత ఘాటుగానే విమర్శలు గుప్పించారు.
భాష చుట్టూ రాజకీయం సరికాదంటూ మొదలు పెట్టిన లోకేశ్… మాతృ భాష చాలా కీలకమైనదని చెప్పారు. ఇదే భావనతో ఉన్న కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు కూడా మాతృ భాషను కాపాడుకోవాలని చెబుతోందని తెలిపారు. త్రిభాషా విధానం పై అనవసర రాద్ధాంతం వద్దని ఆయన హితవు పలికారు. ఈ విషయంలో పక్క రాష్ట్రాలు అపోహలు కల్పించేలా వ్యవహరిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు వింటే… తమిళ సీఎం స్టాలిన్ ఉద్దేశించే లోకేశ్ మాట్లాడారని ఇట్టే అర్థమవుతోంది. అయితే ఎక్కడ కూడా స్టాలిన్ పేరును గానీ… తమిళనాడు పేరును గానీ లోకేశ్ ప్రస్తావించకపోవడం గమనార్హం.
నియోజకవర్గాల పునర్విభజనతో మొదలైన ఈ వివాదం…సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో డీఎంకే, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధానికి కారణంగా నిలిచింది. త్రిభాషా విధానాన్ని తమపై బలవంతంగా రుద్దుతున్నారని డీఎంకే ఆరోపించగా.. డీఎంకే ఆరోపణలను ఎన్డీఏ మంత్రులు కూడా తిప్పికొట్టారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి దర్మేంద్ర ప్రధాన్… డీఎంకే సభ్యులు కనిమొళి, దయానిధి మారన్ తదితరుల మద్య మాటల యుద్దం సాగింది. ఇలాంటి నేపథ్యంలో ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీకి చెందిన కీలక నేత… ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న లోకేశ్.., డీఎంకే తీరును నిరసిస్తూ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. లోకేశ్ వ్యాఖ్యలతో ఇకపై తమిళనాడు పార్టీలు చేపట్టే ప్రాంతీయ ఉద్యమాలకు తాము మద్దతు పలికేది లేదన్న సంకేతాలను ఇచ్చినట్టు అయ్యిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.