పాయల్ ఘోష్.. పొలిటికల్ ఎంట్రీ


తెలుగులో ఇంతకుముందు ప్రయాణం, ఊసరవెల్లి లాంటి సినిమాల్లో నటించిన ముంబయి భామ పాయల్ ఘోష్ ఈ మధ్య కాలంలో ఏమీ సినిమాలు చేసినట్లు లేదు కానీ.. వార్తల్లో మాత్రం బాగానే నిలుస్తోంది. ముఖ్యంగా గత నెలలో బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడైన అనురాగ్ కశ్యప్ మీద ఆమె చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు సంచలనం రేపాయి. ఈ ఆరోపణల్లో భాగంగా రిచా చద్దా సహా ఒకరిద్దరు హీరోయిన్లను తక్కువ చేసి మాట్లాడటం, రిచా పరువు నష్టం దావా వేయడంతో తప్పయిపోయిందని క్షమాపణ చెప్పడం తెలిసిన సంగతే.

ఆ వ్యవహారం తర్వాత ఇప్పుడు పాయల్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. ఆమె చడీచప్పుడు లేకుండా రాజకీయ అరంగేట్రం చేయడం విశేషం. ప్రస్తుతం మోడీ కేబినెట్లో మంత్రిగా ఉన్న రామ్‌‌దాస్ అథవాలె నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో పాయిల్ చేరింది. సోమవారం పార్టీలో చేరగా.. అదే రోజు పాయల్‌ను పార్టీ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలిగా నియమించారు రామ్‌దాస్ అథవాలె. అప్పుడే ప్రెస్ మీట్లో పాల్గొనడంతో పాటు మహిళా నేతలతో కలిసి సందడి చేసిన పాయల్.. ఆరితేరిన రాజకీయ నాయకురాలి లాగా మీడియా ముందు పోజులు కూడా ఇచ్చింది.

పాయల్ సినీ కెరీర్లో పెద్దగా సాధించిందేమీల లేదు. ఆమె కెరీర్లో చేసినవే తక్కువ సినిమాలు. అందులో చెప్పుకోదగ్గ హిట్లు లేవు. అనురాగ్ మీద ఆరోపణలు చేయడానికి ముందు వరకు పాయల్ లైమ్ లైట్లోనే లేదు. ఆ ఆరోపణలతోనే మీడియా ఆమెకు బాగా కవరేజీ ఇచ్చింది.

అసలు అనురాగ్‌తో ఎప్పుడూ కలిసి సినిమా చేయని పాయల్.. అతడి మీద ఇలాంటి ఆరోపణలు చేయడం ఆశ్చర్యం కలిగించింది అందరికీ. ఆ ఆరోపణలు చేస్తూ ఆమె రిచా చద్దా, హ్యూమా ఖురేషి లాంటి హీరోయిన్లను కించ పరిచేలా మాట్లాడటం.. రిచాకు సారీ బేషరతుగా సారీ చెప్పడంతో పాయల్ ఇమేజే దెబ్బ తింది. ఐతే ఎలాగైతేనేం వార్తల్లో నిలిచింది కదా, ఆమె పాపులారిటీ ఉపయోగపడుతుందని రామ్ దాస్ ఆమెను పార్టీలో చేర్చుకుని పదవి కట్టబెట్టినట్లున్నారు.