మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దగ్గుబాటి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. చంద్రబాబు నాయుడుగారికి, తనకు వైరం ఉందని అందరూ అంటుంటారని, అది ఉన్నమాట వాస్తవమేనని దగ్గుబాటి చెప్పారు. కానీ, అదంతా గతమని, అవన్నీ మరచిపోవాలని, ఎప్పుడూ ఒకే రకంగా ఉండకూడని..ముందుకు వెళుతుండాలని అన్నారు. ఈ క్రమంలోనే దగ్గుబాటిని ఆలింగనం చేసుకున్న చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.
తన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు తనకంటే ముందు అన్నీ చెప్పేశాడని, ఇంక చెప్పడానికి ఏమీ లేవని చంద్రబాబు అన్నారు. విశిష్టమైన, సంతోషకరమైన వ్యక్తి అని, ప్రతి విషయంపై ఆయన లోతైన విశ్లేషణ చేస్తారని చంద్రబాబు కొనియాడారు. దగ్గుబాటి పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదని చంద్రబాబు చెప్పారు. 40 ఏళ్లు కలిసి ఉన్నాం, ఆయన పుస్తకం రాయడం ఏంటని తనకు డౌట్ వచ్చిందని..ఆ విషయం ఆయనను కూడా అడిగానని చమత్కరించారు.
అన్న ఎన్టీఆర్ నుంచి తామిద్దరం స్ఫూర్తి పొందామని, ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నామని అన్నారు. దగ్గుబాటి స్వతహాగా రచయిత కాకపోయినా…ఎవ్వరూ టచ్ చేయని సబ్జెక్ట్ పై పుస్తకం రాశారని ప్రశంసించారు. డాక్టర్ అయిన తర్వాత దగ్గుబాటి ప్రాక్టీస్ చేయలేదని, మంత్రిగా ఉండి డాక్టర్ గా ప్రాక్టీస్ చేశాడని, డాక్టర్ గా ఉంటూ సినిమాలు చేశారని సరదాగా వ్యాఖ్యానించారు. రిటైర్మెంట్ లైఫ్ ఎలా ఉందని దగ్గుబాటిని అడిగి తెలుసుకున్నానని, తర్వాత తనకు ఆయన టిప్స్ అవసరమవుతాయని చమత్కరించారు. టెన్నిస్ ఆడుతూ, మిత్రులతో గడుపుతూ, పిల్లలకు కథలు చెబుతూ జీవితంలో మిగిలిన భాగాన్ని సంతోషంగా గడిపేస్తున్నానని దగ్గుబాటి తనకు చెప్పారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
దగ్గుబాటి పురంధేశ్వరిగారిని ఇటీవల ఎన్నికల్లో చూశానని, వారు చూపిన చొరవ, బీజేపీని వారు నడిపించిన విధానం రాష్ట్ర శ్రేయస్సుకు ఉపయోగపడిందని, అందుకు ఆమెను మనస్ఫూర్తిగా అబినందిస్తున్నానని అన్నారు.
ఇక, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇద్దరం ఒకేసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టామని, అప్పటికి ఇప్పటికీ ఆయన మాటలో అదే పంచ్ ఉందని…ఇంకా పదునుగా పంచ్ లు వేస్తున్నారని చమత్కరించారు. ఆనాడు సభలో వెంకయ్యనాయుడు, జైపాల్ రెడ్డితో మాట్లాడాలంటే సీఎంలు, మంత్రులు భయపడేవారని గుర్తు చేస్తున్నారు.