టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీలతో వరుస భేటీలు వేశారు. ఈ భేటీల్లో రాష్ట్రానికి సంబంధించి కేంద్ర మంత్రుల వద్ద ప్రస్తావించాల్సిన అంశాలను సమగ్రంగా ప్రస్తావించడంతో పాటుగా వాటికి సంబంధించిన వినతి పత్రాలను కూడా చంద్రబాబు మంత్రుల చేతుల్లో పెట్టారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర అంశం కనిపించింది.
ఏ కేంద్ర మంత్రి వద్దకు వెళ్లినా చంద్రబాబు ఒంటరిగా వెళ్లనే లేదు. తన పార్టీతో పాటుగా కూటమి పార్టీలకు చెందిన కేంద్ర మంత్రులతో పాటుగా కూటమి ఎంపీలను వెంటబెట్టుకుని ఆయన కేంద్ర మంత్రులను కలిశారు. కేంద్ర మంత్రులతో చర్చల సందర్భంగానూ వారంతా చంద్రబాబు వెంటే… భేటీల్లో పాలుపంచుకున్నారు. ఏదో అలా ఫొటోలకు ఫోజులిచ్చి చర్చల సమయంలో బయటకు వెళ్లడానికి బదులుగా ఆయా భేటీల్లో స్వయంగా పాలుపంచుకున్నారు. దీని వెనుక చంద్రబాబుకు ఓ వ్యూహం ఉన్నట్లు సమాచారం. తాను అమరావతి వెళ్లిపోయినా… ఢిల్లీలోనే ఉండే కూటమి ఎంపీలు, మంత్రులు…ఆయా అంశాలపై సమయం వచ్చినప్పుడల్లా కేంద్రం పెద్దలకు గుర్తు చేస్తూ సాగే అవకాశం ఉంటుంది కదా. అందుకే చంద్రబాబు తన భేటీల్లో పార్టీ నేతలు కూడా ఉండేలా చూసుకుంటున్నారు.
ఇక 2019 నుంచి ఐదేళ్ల పాటు ఏపీకి సీఎంగా వ్యవహరించిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. సీఎం హోదాలో చాలా సార్లే ఢిల్లీ వెళ్లారు. ప్రదాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతోనూ ఆయన భేటీ అయ్యారు. అయితే ఈ భేటీల్లో ఒక్కటంటే… ఒక్క భేటీలోనూ జగన్ వెంట ఆయన పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు గానీ… తనకు అత్యంత నమ్మకస్తుడైన వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సహా రాజ్యసభ సభ్యులు గానీ కనిపించలేదు. కేంద్ర మంత్రుల ఇళ్ల వద్దకు జగన్ వెంట వెళ్లారేమో గానీ… మంత్రులతో బేటీల్లో మాత్రం వారు పాలుపంచుకున్న దాఖలా కనిపించలేదు. ఈ కారణంగానే జగన్ బీజేపీ పెద్దల వద్ద సాగిలపడ్డారని వైరి వర్గాలు ఆయనపై ఆరోపణలు గుప్పించేవి. అయితే ఇప్పుడు చంద్రబాబు తనదైన ఓపెన్ పాలసీతో ఆ తరహా ఆరోపణలకే ఆస్కారం ఇవ్వడం లేదు.