తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి… బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుపై ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాద స్థలిని పరిశీలించేందుకు ఆదివారం దోమలపెంట వెళ్లిన రేవంత్… ప్రమాదం జరిగిన సొరంగంలోకి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఈ ప్రమాదం జరిగి వారం దాటిపోతున్నా సీఎం కనీసం ఈ వైపు కన్నెత్తి చూడటం లేదంటూ విపక్షాలు చేస్తున్న ఆరోఫణల గురించి మీడియా ప్రస్తావించగా…రేవంత్ ఘాటుగా స్పందించారు.
ప్రమాదం జరిగిన వెంటనే తమ ప్రభుత్వం వేగంగా స్పందించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. సాగునీటి శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక్కడే ఉండి ఎప్పటికప్పుడు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. భారత సైన్యంలో పనిచేసిన అనుభవంతో ఉత్తమ్ సహాయక చర్యలను సమర్థవంతంగా చూసుకుంటున్నారని.. మరో ఇద్దరు మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు కూడా సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని.. తాను కూడా ఇక్కడికి రాకున్నా… ఎక్కడ ఉన్నా అనుక్షణం ఇక్కడి పరిస్థితులను మానిటర్ చేస్తున్నానని తెలిపారు. అయితే తానేదో ఇక్కడికి రాలేదని, ప్రమాదాన్ని గాలికి వదిలేశానని విపక్షాలు ఆరోపించడం సబబు కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు ఆరోపణలను ప్రస్తావించిన రేవంత్.. ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్ రావు ఎక్కడికెళ్లారని ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన తర్వాత హరీశ్ రావు దుబాయి వెళ్లలేదా? అని ప్రశ్నించారు. దుబాయిలోని అబుదాబీలో హరీశ్ రావు రెండు రోజుల పాటు నిండా దావత్ లు చేసుకున్నారని ఆయన తెలిపారు. దుబాయి వెళ్లలేదని హరీశ్ రావును చెప్పమనండి అంటూ ఆయన నిలదీశారు. హరీశ్ రావు ఈ విషయంలో నిజం లేదంటే.. తానే ఆ వివరాలను బయటపెడతానని కూడా రేవంత్ అన్నారు. హరీశ్ రావు పాస్ పోర్టు తీసినా…ఎయిర్ పోర్టు రికార్డులను పరిశీలించినా అన్ని వివరాలు ఇట్టే బయటకు వస్తాయని రేవంత్ అన్నారు.
అయినా తానేదో ఇక్కడికి రాలేదని చెబుతున్న హరీశ్ రావు…ప్రమాదం జరిగిన తర్వాత వారం పాటు ఇక్కడికి ఎందుకు రాలేదని రేవంత్ ప్రశ్నించారు. తాను వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలుగుతుందని హరీశ్ రావు చెబుతున్నారన్న రేవంత్… మరి సీఎం స్థాయిలో ఉన్న తాను ఇక్కడికి వస్తే సహాయక చర్యలకు ఆటంకం కలగదా? అని కూడా రేవంత్ ప్రశ్నించారు. విపక్షాలుగా తాము ఏం మాట్లాడినా చెల్లుతుందన్న రీతిలో హరీశ్ రావు మాట్లాడటం తగదన్నారు. తానేదో హరీశ్ రావు బండారం బయటపెట్టాలని అనుకోవడం లేదని… హరీశ్ రావు ఆరోపణలు చేస్తేనే… వాస్తవాలు ఏమిటన్న విషయాన్ని తాను చెబుతున్నానని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా హరీశ్ రావు దుబాయిలో పార్టీలు జరుపుకుంటూ ఎంజాయ్ చేశారన్న రేవంత్ వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరమైన చర్చకు తెర తీశాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates