వీహెచ్ మార్కు స్ట్రాటజీ వర్కవుట్ అవుద్దా..?

కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నేత వి.హన్మంతరావు పని దాదాపుగా అయిపోయిందిలే అని అంతా అనుకున్నారు. వయసు మీద పడిపోయిన నేపథ్యంలో గతంలో మాదిరిగా ఆయన ఇకపైనా యాక్టివ్ గా కదలలేరులే అనుకున్నారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ.. ఇంకా చెప్పాలంటే అందరినీ షాక్ కు గురి చేస్తూ వీహెచ్ అన్ని పార్టీల్లో కాక రేపారు. ఇక తన సొంత పార్టీ, అధికార కాంగ్రెస్ లో అయితే ఏకంగా చిచ్చే రేపారు. మొత్తంగా శనివారం తన ఇంటిలో నిర్వహించిన ఓ చిన్నపాటి సమావేశంతో ఆయన తెలంగాణవ్యాప్తంగా పెద్ద రచ్చకే తెర లేపారు.

వీహెచ్ తన సామాజిక వర్గం మున్నూరు కాపు వర్గానికి చెందిన నేతలతో శనివారం తన ఇంటిలో ఓ సమావేశాన్ని నిర్వహించారు. అనుభవం పరంగా సీనియర్ మోస్ట్ నేత కావడంతో వీహెచ్ పిలిచినంతనే మున్నూరు కాపు నేతలంతా.. ఆయన ఇంటికి క్యూ కట్టారు. అధికార కాంగ్రెస్ తో పాటుగా..విపక్ష బీఆర్ఎస్, బీజేపీలకు చెందిన మున్నూరు కాపు నేతలు పెద్ద సంఖ్యలోనే ఈ భేటీకి హాజరయ్యారు. హాజరు కావడంతోనే సరిపెట్టని ఈ నేతలంతా వీహెచ్ బాటలో నడవాల్సిందేనని కూడా ఒకింత గట్టిగానే తీర్మానించుకున్నట్లు సమాచారం.

ఇక ఈ సమావేశంలో మున్నూరు కాపులనంతా ఐక్యంగా కలిపి ఉంచేందుకు ఏకంగా ఓ కమిటీనే ఏర్పాటు చేసిన ఈ భేటీ…అందులో అన్ని పార్టీలకు చెందిన నేతలకూ అందులో భాగస్వామ్యం దక్కేలా చేసింది. ఇక కుల గణనపైనా ఈ భేటీలో చర్చ జరగగా… రేవంత్ సర్కారును సన్మానిద్దామని… కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిపాదించారట. ఈ సందర్భంగా మున్నూరు కాపులకు ప్రాతినిధ్యం లేని కేబినెట్ ఇప్పటి రేవంత్ దేనని చెప్పిన ఇతర నేతలు… మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇస్తే సన్మానిద్దామని చెప్పారట. ఇక త్వరలో జరగనున్న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మున్నూరు కాపులకు ఓ సీటు కూడా ఇవ్వాలని ఈ సమావేశం డిమాండ్ చేసింది.

కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం వద్ద మంచి పలుకుబడి కలిగిన నేతగా వీహెచ్ కు గుర్తింపు ఉంది. సోనియా వద్దకు నేరుగా వెళ్లగలిన సత్తా కలిగిన వీహెచ్ ఇప్పుడు శనివారం నాటి సమావేశం ద్వారా మరోమారు క్రియాశీలకంగా మారాలని చూస్తున్నట్లుగా సమాచారం. శనివారం నాటి సమావేశంలో భాగంగా మున్నూరు కాపుల కోటాలో వీహెచ్ కు ఎమ్మెల్సీ సీటు ఇవ్వడంతో పాటుగా తమ సామాజిక వర్గం తరఫున ఆయననే కేబినెట్ లోకి తీసుకోవాలని ఆ వర్గం నేతలు తీర్మానించినట్లుగా సమాచారం. అంటే… నేరుగా తనకు ఇవ్వమని అడగకుండా…తన వర్గానికి అన్యాయం జరిగిందన్న విషయాన్ని గుర్తు చేస్తూ..తన వర్గం నేతల ద్వారా తన పేరును తెర మీదకు తీసుకుని రావడంలో వీహెచ్ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి ఆయన వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.