పోలవరం బాధ్యతను మళ్ళీ కేంద్రానికి అప్పగించేస్తుందా ?

జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తాజాగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో ఇటువంటి ప్రతిపాదనలే వచ్చినట్లు సమాచారం. పోలవరం ప్రాజెకక్టు సవరించిన అంచనా వ్యయం రూ . 47725 కోట్లుగా కేంద్రమే ఆమోదించింది. అలాంటిది కొత్తగా సవరించిన అంచనా వ్యయం రూ. 20,398 కోట్లే అని చెప్పటంపై జగన్ తీవ్రంగా మండిపోయారు. జరిగిన పనులకు సంబంధించి రూ. 2234 కోట్లు ఇచ్చేసిన తర్వాత మిగిలిన రూ. 4013 కోట్లను కేంద్రం ఇచ్చేస్తే సరిపోతుందని కేంద్ర జలవనరుల శాఖ, ఆర్ధిక శాఖల నుండి రాష్ట్రప్రభుత్వానికి లేఖ అందింది. ఆ లేఖ విషయంపైనే జగన్ సమీక్ష జరిపారు.

నిజానికి రాష్ట్ర విభజన సందర్భంగా పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా విభజన చట్టంలో చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు కాబట్టి కేంద్రమే కడుతుందని కూడా విభజన చట్టంలో ఉంది. అయితే 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రప్రభుత్వం చేతుల్లోకి తీసుకున్నారు. అప్పటి నుండి కేంద్ర-రాష్ట్రాల మధ్య నిధుల పంచాయితీ జరుగుతునే ఉంది. ఇప్పటికి ఒకటికి రెండు, మూడుసార్లు నిర్మాణ అంచనాలను సవరించింది రాష్ట్రప్రభుత్వం.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రాజెక్టు ఖరీదు కన్నా భూసమీకరణలో భాగంగా నిర్వాసితులకు చెల్లించాల్సిన నష్టపరిహారమే చాలా ఎక్కువ. ప్రాజెక్టు ఖరీదు+నష్టపరిహారం అంతా కలిపి సుమారు రూ. 55548 కోట్లుగా చంద్రబాబునాయుడు హయాంలో కేంద్రం అంగీకరిచింది. అయితే తర్వాత కేంద్రంలోని జలశక్తి ఉన్నతాధికారులు, ప్రాజెక్టు అథారిటి తదితరుల జోక్యం కారణంగా అంచనా వ్యయం రూ. 47,725 కోట్లకు అంగీకారం కుదిరింది.

అయితే తాజాగా ఈ మొత్తంలో కూడా కేంద్రం బాగా కోసేసి చివరకు రూ. 20,398 కోట్లకు లెక్క కట్టడమే ఆశ్చర్యంగా ఉంది. కేంద్రవైఖరి చూస్తుంటే ప్రాజెక్టు పూర్తి చేయటానికి అవసరమైన నిధులను ఇచ్చేట్లు లేదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. కాబట్టి ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతను మళ్ళీ కేంద్రానికి ఇఛ్చేస్తే సరిపోతుందనే విషయం కూడా చర్చ జరిగిందట. అయితే ఎటువటం నిర్ణయం తీసుకోలేదు. కానీ సవరించిన అంచనాలు ఇవ్వటానికి కేంద్రం గనుక అంగీకరించకపోతే మొత్తం ప్రాజెక్టునే మళ్ళీ కేంద్రానికి బదలాయించేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.