టీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్.. ‘వన్ మ్యాన్ ఆర్మీ’ అన్న మాటను సార్థకం చేసుకున్నారు. తన శైలికి చాలా భిన్నంగా.. నారా లోకేష్ వ్యవహరించి.. విమర్శకుల నుంచి కూడా మెప్పు పొందుతున్నారంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. తాజాగా శాసన మండలిలో నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు.. ప్రతిపక్ష సభ్యులకు సూటిగా.. సుత్తిలేకుండా చెప్పిన సమాధానాలు వంటివి నారా లోకేష్ను వన్ మ్యాన్ ఆర్మీగా నిలబెట్టాయి. నిజానికి ఆయనకు శాసన మండలి కొత్తకాదు. 2017-22 వరకు కూడా.. ఆయన శాసన మండలి సభ్యుడిగా ఉన్నారు. అయితే.. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత.. వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు.
ముఖ్యంగా మూడు రాజధానుల వ్యవహారం మండలికి వచ్చినప్పుడు.. చాలా దూకుడుగా నారా లోకేష్ వ్యవహరించారు. ఆ బిల్లును నిలువరించడంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు. అయితే.. అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపించడం గమనార్హం. అప్పట్లో విపక్షంలో ఉండడంతో అధికార పార్టీపై దూకుడు ప్రదర్శిస్తే.. తాజాగా అదికార పక్షంలో ఉన్న నాయకుడిగా.. మంత్రిగా చాలా పరిణితి ప్రదర్శించారు. ముఖ్యంగా .. రాష్ట్ర ప్రయోజనాల వ్యవహారాలపై మాట్లాడిన సందర్భంలో “రండి అందరం కలిసి పనిచేద్దాం. రాష్ట్రాన్నిఅభివృద్ధి చేద్దాం” అని చెప్పిన మాట నభూతో అనే చెప్పాలి.
సాదారణంగా ఒక సభలో ప్రతిపక్ష నాయకులను కలుపుకొని పోతామంటూ.. నాయకులు వ్యవహరించిన విధానం ఇప్పటి వరకు లేదు. ఇది నారా లోకేష్ తొలిసారి చేసిన ప్రయోగమనే చెప్పాలి. ఇదేసమయంలో లెక్కలు, పద్దులు చెప్పాల్సివచ్చినప్పుడు కూడా ఎక్కడా తడబడకుండా.. వాటిని వల్లెవేశారు. అదేసమయంలో వైసీపీ సభ్యులు వాకౌట్ చేస్తున్నప్పుడు.. చూస్తూ కూర్చోకుండా.. వారిని వారించే ప్రయత్నం చేసి.. ‘పెద్ద తరహా’లో వ్యవహారించారు. అదేసమయంలో ప్రభుత్వంపై ఆరోణలు చేసినప్పుడు.. వాటిలో పసలేదన్న విషయాన్ని చెప్పే సమయంలో అంతే ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకరకంగా.. చెప్పాలంటే.. అన్ని రసాలను పోషించారన్న మాట. ఇది అంత ఈజీ అయిన విషయం కాదు. మండలిలో బలంగా ఉన్న వైసీపీని ఎదుర్కొంటూ.. అదేసమయంలో వివాదాలకు తావులేకుండా సమాధానం చెబుతూ.. మరోవైపు.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ చిత్రాన్ని ఆవిష్కరించడం ద్వారా నారా లోకేష్ వన్ మ్యాన్ ఆర్మీగా టీడీపీకి, కూటమి సర్కారుకు బలమైన బూస్ట్ ఇచ్చార న్న వాదనలో వాస్తవం ఖచ్చితంగా ఉంది. ఎక్కడా తడబాటు లేకుండా.. ఆయన వ్యవహరించిన తీరు మండలిలో అందరికీ ఆకట్టుకుంది. ముఖ్యంగా విమర్శకుల నుంచి కూడా.. ప్రశంసలు అందుకునేలా చేసింది.