పోసాని సతీమణికి ఫోన్ చేసిన జగన్

ప్రముఖ సినీ నటుడు, వైసీపీ మాజీ నేత పోసాని కృష్ణ మురళిని ఏపీ సీఐడీ పోలీసులు బుధవారం రాత్రి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్నను వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు గురువారం ఉదయం పోసాని అరెస్ట్ పై స్పందించిన జగన్… అరెస్ట్ ను ఖండిస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకండా పోసాని సతీమణికి జగన్ ఫోన్ చేశారు. పార్టీ మీ కుటుంబానికి అండగా ఉంటుందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమెకు జగన్ చెప్పారు.

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ అయిన సందర్భంగా జగన్ సాయంత్రం దాకా స్పందించనే లేదు. తెల్లవారుజామున వంశీ అరెస్ట్ అయితే సాయంత్రం ఎప్పుడో జగన్ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే పోసాని పార్టీని ఇటీవలే రాజీనామా చేశారు. అంతేకాకుండా గతంలో తాను చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే క్షమాపణ చెప్పారు. ఇకపై రాజకీయాల జోలికి రాబోనంటూ వేడుకున్నారు కూడా. మొత్తంగా రాజకీయాల్లోకి వచ్చి తాను ఇబ్బందుల్లో పడిపోయానన్న భావన వచ్చేలా పోసాని వ్యాఖ్యలు స్ఫురించాయి.

ఈ క్రమంలో పోసాని అరెస్ట్ పై జగన్ స్పందిస్తారా? అన్న దిశగా విశ్లేషణలు సాగాయి. వంశీ అంటే.. 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు కాబట్టి…ఆయన అరెస్ట్ పై స్పందించిన జగన్.. జైలుకు వెళ్లి మరీ వంశీని పరామర్శించారని… పోసాని విషయం అలా కాదు కదా అని కొందరు భావించారు. వైసీపీకి అనుకూలంగా మాట్లాడిన కారణంగానే తాను ఇబ్బంది పడుతున్నానన్న అర్థం వచ్చేలా పోసాని వ్యవహరించారు కదా… అలాంటి పోసానికి జగన్ మద్దతుగా నిలుస్తారా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందేహాలను పటాపంచలు చేస్తూ పోసాని అరెస్ట్ ను ఖండించడంతో పాటుగా నేరుగా పోసాని సతీమణికి ఫోన్ చేసి మరీ ధైర్యం చెప్పారు.