రీజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తమిళనాట అడుగు పెట్టేశారు. తమిళగ వెట్రీ కజగమ్ (టీవీకే) పేరిట ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్ పార్టీ కోసం పనిచేసేందుకు ఆయన రంగంలోకి దిగిపోయారు. ఇప్పటికే టీవీకే, పీకేల మధ్య అవగాహన కుదరగా… ఆ వెంటనే వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని టీవీకే పనిని పీకే ప్రారంభించారు. ఏడాది తర్వాత జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా నగారా మోగిస్తున్నట్లుగా టీవీకే బుధవారం భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయగా… అందులో పీకే స్వయంగా పాల్గొనడంతో పాటు కీలక ప్రసంగం చేశారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే గెలిచిపోయిందన్న దిశగా పీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. టీవీకే శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఈ సందర్భంగా తనను తాను కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీతో పోల్చుకున్న పీకే… తాను కూడా ధోనీ మాదిరే బిహార్ కు చెందిన వాడినేనని తెలిపారు. తమిళనాట ధోనీకి ఉన్న పాపులారిటీ తనకు బాగానే తెలుసునని చెప్పిన పీకే… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాట ధోనీ కంటే కూడా తానే మోర్ పాపులర్ అయిపోతానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. తమిళనాడుకు చెందిన ఇండియా సిమెంట్స్ ఆధ్వర్యంలో ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కొనసాగుతున్నసంగతి తెలిసిందే. ఆ జట్టుకు ఘన విజయాలు అందించిన ధోనీకి తమిళనాట ఎక్కడ లేని పాపులారిటీ ఉన్న సంగతీ తెలిసిందే.
ఇదే విషయాన్ని పదే పదే ప్రస్తావించిన పీకే… చెన్నై సూపర్ కింగ్స్ ను ధోనీ గెలిపిస్తే… తాను టీవీకేను గెలిపిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అలాంటప్పుడు తాను ధోనీ కంటే కూడా తమిళనాట మోర్ పాపులర్ అయిపోతాను కదా అని పాకే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు టీవీకే శ్రేణుల నుంచి భారీ స్పందన అయితే వచ్చింది. తనను పదే పదే బీహారీగా చెప్పుకున్న పీకే… ధోనీని కూడా బీహారీగానే చెప్పారు. ఈ వ్యాఖ్యలు విన్న విజయ్ కూడా పీకే వైపు నవ్వుతూ చూశారు. ఇదిలా ఉంటే.. ఎన్నికల వ్యూహాలు ఇచ్చేందుకు వచ్చిన పీకేను గతంలో వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం పరిచయం చేసి అలా వదిలేస్తే..విజయ్ మాత్రం మరో అడుగు ముందుకేసీ ఏకంగా పీకేకు వేదిక మీద మాట్లాడే అవకాశం కూడా ఇవ్వడం గమనార్హం.