టీడీపీ ఆఫీసుపై దాడి.. 30 మందికి బెయిల్‌

గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాల‌యంపై 2022లో జ‌రిగిన దాడి.. విధ్వంసం కేసులో మాజీ మంత్రి జోగి ర‌మేష్ స‌హా.. యువ నాయ‌కుడు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి వంటి మొత్తం 30 మంది  నాయ‌కుల‌కు సుప్రీంకోర్టు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ మేర‌కు తాజాగా సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం ఉత్త‌ర్వులు జారీ చేసింది. అయితే.. కేసు విచార‌ణ సంద‌ర్భంగా ఇటు స‌ర్కారు త‌ర‌ఫున‌, అటు వైసీపీ త‌ర‌ఫున హోరా హోరీ వాద‌న‌లు జ‌రిగాయి.

స‌ర్కారు త‌ర‌ఫున సిద్ధార్థ‌లూథ్రా వాద‌న‌లు వినిపించారు. ఇది కుట్ర పూరిత నేర‌మ‌ని.. కార్యాల‌యాన్ని ధ్వంసం చేయ‌డ‌మే ఉద్దేశం కాద‌ని.. అందులో ఉన్న నాయ‌కుల‌ను కూడా.. హ‌త్య చేయాల‌ని ప‌న్నాగం ఉంద‌న్నారు. అయితే.. ఇది నేర పూరిత కుట్ర అనేందుకు బ‌ల‌మైన సాక్ష్యాల‌ను ప్రొడ్యూస్ చేయ‌లేక పోయార‌ని.. సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది. పైగా మూడేళ్లు తాత్సారం చేశార‌ని.. ప్ర‌భుత్వాల‌తో త‌మ‌కు ప‌నిలేద‌ని.. పోలీసులు ఏం చేశారో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది.

అయితే.. పోలీసులు త‌ర‌ఫున కూడా లూథ్రావాద‌న‌లు వినిపిస్తూ.. వారు కేసు న‌మోదు చేశార‌ని.. కానీ, నిందితులు హైకోర్టును ఆశ్ర‌యించ‌డ‌తో ఆల‌స్యం జ‌రిగింద‌న్నారు. ఇక‌, పిటిష‌నర్ల త‌ర‌ఫున‌.. పొన్న‌వోలు సుధాక‌ర్‌, క‌పిల్ సిబాల్ వంటి సీనియ‌ర్లు వాద‌న‌లు వినిపిస్తూ.. ఇది నేర పూరిత కుట్ర కాద‌న్నారు. కొంద‌రు రెచ్చ‌గొట్ట‌డం వ‌ల్ల జ‌రిగిన పొర‌పాటుగా పేర్కొన్నారు. అయిన‌ప్ప‌టికీ.. నిందితులు.. త‌మ పాస్ పోర్టును అప్ప‌గించేశార‌ని తెలిపారు.

ఈ వివ‌రాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. 30 మంది నిందితుల‌కు రెగ్యుల‌ర్ బెయిల్ మంజూరు చేసింది. పైగా.. ఈ కేసులో ఏదైనా వాద‌న‌లు ఉంటే.. ప్ర‌భుత్వం హైకోర్టుకు చెప్పుకోవాల‌ని సూచించింది. అనంతరం.. ఈ కేసును మూసి వేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించింది. ఇదిలావుంటే.. గ‌తంలో ఈ కేసులో జోగి ర‌మేష్ స‌హా.. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్‌ల‌ను పోలీసులు విచారించారు. అనంత‌రం.. వీరు బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు.