గ్రూప్-2 తేనెతుట్టెను కదిపిందెవరు?

ఈ రోజు నిర్వహించిన గ్రూప్-2 పరీక్ష విషయంలో పెద్ద వివాదమే ముసురుకుంది. ఈ పరీక్షను రద్దు చేయాలంటే వేల మంది అభ్యర్థులు రోడ్డు మీదికి వచ్చారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాడబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌ల మీద ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో గ్రూప్-2 ఆశావహులు మండిపడుతున్నారు. ఈ పరీక్షను రద్దు చేయాలని ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ వీలు పడలేదు. కొన్ని చిక్కుముడుల వల్లే ఇది సాధ్యం కాలేదని అర్థమవుతోంది.

ఐతే ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడానికి ఇది మంచి అవకాశమే అయినా.. వైసీపీ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకుంటుండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఐతే ఈ ఇష్యూను టేకప్ చేస్తే జగన్ చేసిన తప్పుల మీద చర్చ జరిగి.. తమ పార్టీనే బద్నాం అవుతుందనే ఉద్దేశంతోనే వైసీపీ సైలెంటుగా ఉందనే వాదన వినిపిస్తుండడం గమనార్హం. ఈ నేపథ్యంలో గ్రూప్-2 పరీక్షకు సంబంధించి మొదట్నుంచి అసలేం జరిగిందో ఒకసారి చూడాల్సిన అవసరముంది.

ఈ వివాదం మొదలైంది జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 2023 డిసెంబరులో హడావుడిగా 899 పోస్టులతో గ్రూప్ 2 నోటిఫికేషన్ ఇచ్చింది జగన్ ప్రభుత్వం. ప్రిలిమ్స్ తర్వాత 92250 మంది అర్హత సాధించారు. అయితే 2023 గ్రూప్ 2లో రోస్టర్ పాయింట్లను కావాలనే తప్పు ఇచ్చారనే ఆరోపణలున్నాయి. రోస్టర్ పాయింట్స్ తప్పుగా ఉన్నాయని కొందరు కోర్టుకు వెళ్లగా.. కేసు అయ్యింది. ఈ లోపు ప్రభుత్వం మారింది. ఐతే హైకోర్టు ఆదేశాల ప్రకారం ఫిబ్రవరి 23న మెయిన్స్ పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది.

తుది తీర్పుకు లోబడి నియామకాలు అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. కానీ రోస్టర్ పాయింట్లు తప్పుగా ఇవ్వడం, పరీక్ష విషయంలో సందిగ్ధత వల్ల సరిగా సన్నద్ధం కాకపోవడంతో అభ్యర్థులు పరీక్ష రద్దు చేయాలని ఆందోళన బాట పట్టారు. దీంతో అభ్యర్థుల కోణంలో ఆలోచించి చంద్రబాబు పరీక్ష రద్దు చేయాలని ఏపీపీఎస్సీకి లేఖ రాశారు. ఐతే ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పరీక్ష రద్దు చేస్తే అధికార పక్షానికి లబ్ది చేకూరుతుందని పేర్కొంటూ కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఏపీపీఎస్పీ పరీక్ష వాయిదా కుదరదు అని చెప్పింది.

కానీ అభ్యర్థులు మాత్రం పరీక్ష రద్దు చేయకపోవడంపై ప్రభుత్వాన్ని తప్పుబడుతూ నిన్నటి వరకు ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు పరీక్ష జరిగిపోయింది. చాలామంది అయిష్టంగానే పరీక్షకు హాజరయ్యారు. ఎన్నికల్లో లబ్ది కోసం హడావుడిగా నోటిఫికేషన్ ఇవ్వడమే కాక, రోస్టర్లో తప్పులతో గందరగోళాన్ని సృష్టించింది జగన్ అండ్ కోనే అని.. ఇప్పుడు పరీక్ష రద్దు చేయకూడదని ఫిర్యాదులు వెళ్లడం వెనుక కూడా జగన్ పార్టీనే ఉందని టీడీపీ, జనసేన ఆరోపిస్తున్నాయి.