స్వామి కార్యంతో పాటు స్వకార్యం కూడా.. !

టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆ పార్టీ ఎమ్మెల్యే రేఖా గుప్తా చేయనున్న ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఈ మేరకు బీజేపీ అధిష్ఠానం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు… రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్నివాయిదా వేసుకుని మరీ హస్తిన వెళ్లారు. ఎన్డీఏలో బీజేపీ తర్వాత అత్యధిక సంఖ్యలో ఎంపీలున్న పార్టీగా టీడీపీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే బీజేపీ అధిష్ఠానం నుంచి చంద్రబాబుకు ప్రత్యేక ఆహ్వానం అందింది.

ఇదిలా ఉంటే… పని ఏదైనా. సమయం ఏదైనా, సందర్భం ఏదైనా… చంద్రబాబు దృష్టి మొత్తం రాష్ట్ర ప్రయోజనాల మీదే ఉంటుంది. అసలే రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఎలాగోలా రాష్ట్రాన్ని గడ్డన పడేయాలని చంద్రబాబు యత్నిస్తున్నారు. అందుకోసం అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ఆయన కదులుతున్నారు. అందులో భాగంగా అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఆయన వదులుకోవడం లేదు. ఇప్పుడు ఢిల్లీ వెళ్లింది… అక్కడి సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకే అయినా… రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా ఓ ప్రణాళికలను సిద్దం చేసుకుని మరీ చంద్రబాబు ఢిల్లీ ఫ్లైటెక్కారు.

ఈ ప్రణాళిక ప్రకారం ఢిల్లీ సీఎం పదవీ ప్రమాణ కార్యక్రమం ముగిసినంతనే చంద్రబాబు తన పని ప్రారంభించనున్నారు. అందుబాటులో ఉండే పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. అందులో భాగంగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై అమిత్ షాతో చంద్రబాబు చర్చించనున్నట్లు సమాచారం. ఇక మిర్చి రైతులకు మద్దతు ధర విషయంపై చర్చించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తోనూ చంద్రబాబు భేటీ అయ్యే అవకాశాలున్నాయి. ఇప్పటికే మిర్చి రైతుల సమస్యలపై ఆయన కేంద్ర మంత్రికి బుధవారం లేఖ రాసిన సంగతి తెలిసిందే. తాజాగా అదే సమస్యపై చర్చించేందుకే చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యే అవకాశాలున్నాయి.