నాకు పోలీసు భద్రత కల్పించలేదు: జగన్

మీర్చికి గిట్టుబాటు ధర లేదని రైతులు వాపోతున్నారని, ఈ క్రమంలోనే గుంటూరు మార్కెట్ యార్డులో మిర్చి రైతులను పరామర్శించేందుకు పులివెందుల ఎమ్మెల్యే జగన్ పర్యటిస్తారని వైసీపీ నేతలు చెప్పిన సంగతి తెలిసిందే. అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్పారు. జగన్ సభ, ర్యాలీ చేయబోరని, కేవలం మిర్చి రైతులతో మాట్లాడారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఎప్పటిలాగే పోలీసుల మాటలను బేఖాతరు చేసిన జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు.

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు తానే ప్రతిపక్ష నాయయుడిని అని చెప్పుకున్న జగన్…తనకు పోలీసుల భద్రత కల్పించలేదని ఆరోపించారు. అంతేకాదు, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదని, రేపు ప్రతిక్షంలో టీడీపీ ఉన్నప్పుడు తాము కూడా ఇలా పోలీసుల భద్రత తీసేస్తే ఎలా ఉంటుందో ఆలోచించుకోవాలని చంద్రబాబును జగన్ హెచ్చరించారు. మిర్చి రైతుల ఇబ్బందులును చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ఏ పంట వేసినా గిట్టుబాటు ధర లేదని జగన్ ఆరోపించారు. క్వింటా మిర్చి అమ్మితే రూ.10-12 వేలు కూడా రావడం లేదని అన్నారు. వైసీపీ హయాంలో మిర్చి క్వింటాకు రూ.21 నుంచి 27 వేల వరకు ధర వచ్చేదని చెప్పారు. రైతులు పండించిన పంట అమ్ముకోలేని పరిస్థితి ఉందని విమర్శించారు. రాబోయే రోజుల్లో రైతుల తరఫున ఉద్యమిస్తామని అన్నారు. రైతులను దళారులకు చంద్రబాబు ప్రభుత్వం అమ్మేసిందని ఆరోపించారు.

తమ హయాంలో రైతులకు ఎంతో మేలు చేసిన ఆర్బీకే వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని అన్నారు. ఇకనైనా మిర్చి రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు మిర్చి యార్డుకు రావాలని, రైతుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని రైతుల తరఫున హెచ్చరిస్తున్నామని చెప్పారు.

అయితే, తాజాగా జగన్ చేసిన కామెంట్లపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించి పోలీసులు వద్దంటున్నా వినకుండా మిర్చి యార్డుకు జగన్ రావడం తప్పు అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. తాను తప్పు చేసింది కాకుండా తన లాగే చంద్రబాబునూ తప్పు చేయమంటోన్న జగన్ అంటూ నెటిజన్లు జగన్ ను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.